తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుమ దంపతులు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుమ దంపతులు

వరంగల్ టైమ్స్, తిరుపతి జిల్లా : తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతులు శనివారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

అనంతరం ఆలయంలోకి వెళ్లిన యాంకర్ సుమ,నటుడు రాజీవ్ కనకాల దంపతులు, సుమ తల్లి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అదే విధంగా లోక్ సభ ఎంపీ బి.కె పార్థసారథి సైతం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి మెట్లభక్తులకు తిరుపతిలో టోకెన్లు
మరోవైపు శ్రీవారి మెట్ల మార్గం నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ లో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల పంపిణీ ప్రక్రియను టీటీడీ శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభించింది. ఇందుకు అధికారులు 10 కౌంటర్లతో పాటు అదనంగా మరో 4 కౌంటర్లను ఏర్పాటు చేశారు.