హైదరాబాద్ : పల్లె ప్రగతితో తెలంగాణ గ్రామీణ ముఖచిత్రమే మారిందని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రశంసించారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. తండాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటు, హరిత తెలంగాణలో నర్సరీలు, గతంలో దేశంలోనే ఎవరూ చేపట్టని, తెలంగాణ ప్రభుత్వం మాత్రమే చేపట్టిన పథకాల్లో 2601 రైతు వేదికల వంటి వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గవర్నర్ ప్రకటించారు. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాలు, బాధితులకు ప్రభుత్వం అసరా పెన్షన్లు , ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీరు అందిస్తుందని కొనియాడారు. అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిర్వహిస్తున్న పలు అంశాలను గవర్నర్ తమిళిసై తమ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు.

తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి, దేశంలో అనేక అవార్డులు తెచ్చిన మిషన్ భగీరథ పథకం రాష్ట్ర ప్రజలు దశాబ్దాల తరబడి అనుభవించిన మంచినీటి కష్టాలను రూపుమాపిందన్నారు. ఈ పథకం యావత్ దేశానికి ఓ టార్చ్ బేరర్ గా నిలిచిందని గవర్నర్ అభినందించారు. వంద శాత ఇండ్లకు, అన్ని పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు నల్లాల ద్వారా స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కేంద్ర ప్రభుత్వ జల్ శక్తి మిషన్ ప్రకటించడం గొప్ప ప్రశంసగా గవర్నర్ అభివర్ణించారు. మారుమూల పల్లెలకు, గిరిజన తండాలకు, ఆదివాసీ గూడెంలకు, మిషన్ భగీరథ మంచినీరు అందుతుందన్నదని గవర్నర్ తెలిపారు.
2014కు ముందు కేవలం 5,672 ఆవాసాలు మాత్రమే ఉండేవన్నారు. అదీ పాక్షికంగా మంచినీరు అందేదని గవర్నర్ తెలిపారు. కానీ నేడు రాష్ట్రంలో 24,543 ఆవాసాల ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ ప్రతి రోజూ సురక్షితమైన నీరు నల్లాల ద్వారా సరఫరా అవుతుందని గవర్నర్ చెప్పారు. 57,26,804 హౌజ్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. 65 ఇన్ టేక్ బావులు, 109 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, 1,49,905 కి.మీ. పైప్ లైన్, 13,901 సర్వీస్ క్రాసింగ్ లు ఈ బృహత్తర పథకంలో భాగంగా నిర్మితమైనట్లు చెప్పారు. స్కూల్స్, అంగన్ వాడీలు, రైతు వేదికలు, స్మశాన వాటికలకు 87,412 కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. మంచినీటి పథకాల కోసం 2014కి ముందు 4,198 కోట్లు మాత్రమే వినియోగించగా, 2014 నుంచి ఇప్పటి వరకు 32,500 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. శాశ్వతంగా మంచినీటి సమస్యను పరిష్కరించినట్లు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ వివరించారు. మూడేళ్లల్లోనే ప్రాజెక్టును పూర్తి చేయడం ఒక రికార్డు అని చెప్పారు.
మిషన్ భగీరథ పథకం వల్ల ఫ్లోరైడ్ పీడ విరగడ అయిందన్నారు. కేంద్రం మంచినీరు, పారిశుధ్య శాఖను పార్లమెంట్ కు సమర్పించిన నివేదికలో తెలంగాణను ఫ్లోరైడ్ రహిత రాష్ట్రగా పేర్కొన్నదన్నారు. ఇది అద్భుతమైన విజయమన్నారు., గత పాలకులు 60 ఏళ్లలో సాధించలేని ప్రగతిని కేవలం మూడేళ్లల్లోనే సాధించడం తన ప్రభుత్వ ఘనతగా గవర్నర్ సగర్వంగా ప్రకటించారు.
సంపద పంచాలి, పేదలకు పంచాలి అనే లక్ష్యతో ఇంటింటికీ సంక్షేమ ఫలాలను అందేలా ప్రభుత్వం పని చేస్తున్నదని గవర్నర్ ప్రశంసించారు. పెరుగుతున్న ఆదాయాన్ని ప్రభుత్వం పేదలకే పంచుతున్నదని గవర్నర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడేనాటికి కేవలం 200 రూపాయలుగా ఉన్న పెన్షన్లను రూ.2,016, వికలాంగులకు రూ.500 నుంచి రూ.3016 పెంచి అందిస్తున్నది. ఒంటరి మహిళలకు, బోధకాలు బాధితులకు కూడా పెన్షన్లు అందిస్తున్నామని గవర్నర్ వివరించారు. తెలంగాణ ఏర్పడేనాటికి 26,21,828 మందికి మాత్రమే పెన్షన్లు అందగా, ఇప్పుడు 39, 36, 521 మందికి పెన్షన్లు అందుతున్నాయని గవర్నర్ వెల్లడించారు. నాడు పెన్షన్ల కోసం రూ. 860 కోట్లు ఖర్చు చేయగా, నేడు రూ. 8,710 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు గవర్నర్ తెలిపారు.
లంబాడీలు, ఆదివాసీలు నివాసముండే అన్ని ఆవాసాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతో 3,146 ఎస్టీలు సర్పంచ్ లుగా అయ్యే అవకాశం లభించింది. గతంలో 8,690 గ్రామ పంచాయతీలుంటే, వాటి సంఖ్యను 12,769కి పెంచి, ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు అందే విధంగా ప్రతి నెలా రూ.308 కోట్లను విడుదల చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని గవర్నర్ చెప్పారు. పల్లె ప్రగతి కింద నిరంతరం పారిశుద్ధ్యం నిర్వహిస్తున్నం. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు సమకూర్చుకున్నం. నర్సరీలు, డంపు యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, స్మశాన వాటికలు సమకూరాయని గవర్నర్ ప్రస్తావించారు. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం వల్ల ప్రభుత్వం స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డులు దక్కించుకున్నదన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్న పథకాల్లోనూ గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖలను గవర్నర్ సముచితంగా ప్రస్తావించారు. మిషన్ భగీరథ మంచినీరు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, ఇమామ్, మౌజమ్ లకు భృతి వంటి అంశాలను గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ వివరించారు.