హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నప్పటికీ ఎలాంటి సంచనాలు లేకుండా సాఫీగా సాగిపోయింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎరవనే అంశంపై గత నాలుగైదు రోజుల నుంచి ఉత్కంఠ కొనసాగింది. దీంతో మేయర్ గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా మోతె శ్రీలత పేర్లను ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ అందరిలో ఒక రకమైన ఉత్కంఠ ఉండిపోయింది. మొత్తానికి ఎలాంటి సంచనాలు లేకుండా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది.
జీహెచ్ఎంసీ మేయర్గా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ అధికారి శ్వేతా మహంతి అధికారికంగా ప్రకటించారు. మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేటర్లకు శ్వేతా మహంతి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన మేయర్ విజయలక్ష్మికి, డిప్యూటీ మేయర్ శ్రీలతకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు.
మేయర్గా విజయలక్ష్మి పేరును కార్పొరేటర్ బాబాఫసీయుద్దీన్, మచ్చబొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్, కూకట్పల్లి కార్పొరేటర్ జూప్లి సత్యనారాయణ ప్రతిపాదించారు. అనంతరం ఎన్నికల నిర్వహణ అధికారి శ్వేతా మహంతి ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. చేతులెత్తే విధానం ద్వారా మేయర్ ను ఎన్నుకున్నారు. మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతు తెలిపింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి, సీఎం కేసీఆర్ , టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అందరి సలహాలు స్వీకరిస్తాను అని పేర్కొన్నారు. నగరంలో మహిళలకు మరింత భద్రత కల్పిస్తాను అని స్పష్టం చేశారు. అవినీతిపై పోరాటం కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని తేల్చిచెప్పారు. మేయర్గా, డిప్యూటీ మేయర్గా ఒకేసారి ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నానని విజయలక్ష్మి పేర్కొన్నారు.