అమరావతి : విశాఖ ఏజెన్సీ స్ట్రాబెర్రీ సాగుకు అనుకూలంగా ఉన్నందున పెద్ద ఎత్తున సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కోరారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ను కలిసి స్ట్రాబెర్రీ పండ్లను బహుకరించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో వైసీపీ ఎంపీలు సీఎం జగన్ ను కలిశారు. జిల్లాలోని ఏజెన్సీలోని చింతపల్లి మండలం లంబసింగి పరిసర గ్రామాల్లో స్ట్రాబెర్రీ పంటను గిరిజనులు సాగుచేస్తున్నారని ఎంపీ మాధవి సీఎం జగన్కు సూచించారు.
సాగును ప్రోత్సహిస్తే పర్యాటకంగా కూడా మరింత అభివృద్ధి చెందుతుందని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారన్నారు. గిరిజన రైతులకు ఆదాయ వనరులు పెంపొందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం సూచించారని ఎంపీ మాధవి పేర్కొన్నారు.