కాళేశ్వరం కమిషన్ 20 ప్రశ్నలు..ధీటుగా హరీష్ రావు సమాధానాలు
40 ని.ల పాటు కొనసాగిన విచారణ
అన్ని ఆధారాలు సమర్పించిన హరీష్ రావు
తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్ ల ప్రస్తావన
కొవిడ్ వల్ల డిలే అయిన రెవెన్యూ
తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంపై చాలాసేపు ప్రశ్నలు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విచారణ ముగిసింది. బీఆర్కే భవన్ లో 40 నిమిషాల పాటు కొనసాగిన విచారణలో కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అడిగిన అన్ని ప్రశ్నలకు హరీష్ రావు సమాధానం ఇచ్చారు. మొత్తం 20 ప్రశ్నలు అడుగగా, ప్రతీ ప్రశ్నకు హరీష్ రావు ఆధారాలు సమర్పిస్తూ సమాధానం ఇచ్చారు.విచారణకు ముందు తెలంగాణ భవన్ లో హరీష్ రావు, కేటీఆర్ తో సమాలోచనలు జరిపారు. అనంతరం ర్యాలీగా బీఆర్కే భవన్ కు చేరుకుని విచారణకు హాజరయ్యారు.
ప్రధానంగా కాళేశ్వరం కార్పొరేషన్ డిజైన్ల మార్పుపై కమిషన్ హరీష్ రావును ప్రశ్నించింది. బ్యారేజీలలో నీళ్లను నింపడం, డిజైన్లు తయారీపై కమిషన్ ప్రశ్నించింది. ప్రాజెక్టుల డిజైన్లు, సబ్ కమిటీల ఏర్పాటు, నిర్మాణం వంటి అంశాలపై హరీష్ రావు జీవోలు, డాక్యుమెంట్ల ఆధారంగా క్లుప్తంగా వివరించారు.
కమిషన్ : విచారణ సందర్భంగా ఇరిగేషన్ మంత్రిగా ఎన్ని రోజులు పనిచేశారని, జీవో 115 మంత్రుల సబ్ కమిటీ ఏ అంశాలపై స్టడీ చేసిందని కమిషన్ హరీష్ రావును ప్రశ్నించింది.
హరీష్ రావు : రైతులకు ఎక్కువ సంఖ్యలో నీళ్లు అందించడానికి అప్పటి ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. సబ్ కమిటీలు తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్, హరీష్ రావు(తాను) ఉన్నాము. సీడబ్ల్యూసీ, రిటైర్డ్ ఇంజనీర్ల సూచనల మేరకు మేడిగడ్డ నిర్మాణం జరిగింది.
మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి, తుమ్మిడిహట్టి వద్ద నుంచి మేడిగడ్డకు మార్చాం. 16 లక్షల కంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలంటే, రిజర్వాయర్ల సంఖ్య పెంచాలని సీడబ్ల్యూసీ చెప్పింది. సీడబ్ల్యూసీ సూచనల మేరకే బ్యారేజీలు, రిజర్వాయర్ల సంఖ్య పెంచాం. మేడిగడ్డ నిర్మాణం ఒక్కరి నిర్ణయం కాదు. మేడిగడ్డ నిర్మాణానికి ముందు మంత్రులు, అధికారులు అనేక సార్లు భేటీ అయ్యారు.
వ్యాప్కాన్స్ సంస్థ నివేదికల ఆధారంగా మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలు నిర్మించాం. మేడిగడ్డ నిర్మించాలని రిటైర్డ్ ఇంజనీర్లు సైతం రిపోర్టులు ఇచ్చారు.
కమిషన్ : అన్నారం సుందిళ్ల లొకేషన్ మార్చడంపై ఏమైనా చర్యలు తీసుకున్నారా?
హరీష్ రావు : లొకేషన్ మార్పు అంశం పూర్తిగా టెక్నికల్. టెక్నికల్ రిపోర్టులు ఆధారంగా లొకేషన్స మారాయి. బ్యారేజీలు, ప్రాజెక్టుల లొకేషన్స్ మారడం ఇప్పుడు కొత్తేమి కాదు. గతంలో నాగార్జునసాగర్, కాంతనపల్లి లాంటి ప్రాజెక్టులు లొకేషన్ లు మారాయి.
కమిషన్ : ప్రాజెక్టుల లొకేషన్ లు మార్చే అధికారం హైపవర్ కమిటీకి అధికారం ఉందా ?
హరీష్ రావు : అప్పటి ప్రభుత్వం హై పవర్ కమిటీకి అన్ని అధికారులు ఇచ్చింది.
కమిషన్ : కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు కారణం ఏంటి ?
హరీష్ రావు : లోన్స్ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం.
కమిషన్ : కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్స్ రీపేమెంట్స్ ఎలా చేయాలనుకున్నారు ?
హరీష్ రావు : నీళ్లను అమ్మి లోన్లను రీపేమెంట్స్ చేయాలి అనుకున్నాము.
కమిషన్ : కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయిందా. అయితే ఎంత చేశారు ?
హరీష్ రావు : కొవిడ్ కారణంగా రెండేళ్లు డిలే అయింది.
కమిషన్ : నిర్మాణ సంస్థలకు సైట్ ఆలస్యంగా ఎందుకు ఇచ్చారు ?
హరీష్ రావు : సాధారణంగా అప్పటి పరిస్థితులు ఆధారంగా సైట్స్ కొంత డిలే అవుతాయి.
కమిషన్ : మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు డైరెక్ట్ గా నీళ్లు ఇవ్వొచ్చని ఎక్స్ పర్డ్ కమిటీ చెప్పిందా ?
హరీష్ రావు : డైరెక్ట్ గా నీళ్లు ఇవ్వడానికి సాధ్యం కాదని ఎక్స్ పర్ట్ కమిటీ చెప్పింది.
కమిషన్ : కాళేశ్వరం ద్వారా ఎన్ని నీళ్లు స్టోరేజీ చేశారు ?
హరీష్ రావు : రిజర్వాయర్ల ద్వారా 141 టీఎంసీల నీళ్లను స్టోరేజ్ చేశాం
కమిషన్ : బ్యారేజీలలో ఫుల్ లెవెల్ ట్యాంక్ వరకు నీళ్లను స్టోర్ చేశారా ?
హరీష్ రావు :టెక్నికల్ అంశాలు అధికారులు మాత్రమే చూసుకుంటారు.
కమిషన్ : బ్యారేజీలలో నీళ్లను నింపమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా ?
హరీష్ రావు : బ్యారేజీలలో నీళ్లను నింపమని ఎవరూ ఆదేశించలేదు.
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు అన్ని ఆధారాలు కమిషన్ కు సమర్పించానని చెప్పారు. తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారని చాలాసేపు ప్రశ్నించారని చెప్పారు. దీనిపై తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఐదారు సమావేశాలు జరిగాయని తెలిపారు. కేసీఆరే స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి సీఎం ఫడ్నవీస్ కు చప్పే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. తమ్మిడిహట్టి వద్ద అనుమతించాలని ఎంత నష్టపరిహారమైనా ఇస్తామని స్పష్టంగా చెప్పినా మహారాష్ట్ర ఒప్పుకోలేదని హరీష్ రావు చెప్పారు.