జనగామ జిల్లా : ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా మొక్కలు నాటి ఆయనకు కానుకగా వాటిని సంరక్షించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా (పాలకుర్తి నియోజకవర్గం) తొర్రూరులోని పార్టీ ఆఫీసులో తొర్రూరు, పెద్ద వంగర, రాయపర్తి మండలాల ముఖ్య నాయకులతో, పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల ముఖ్య నాయకులతో వేర్వేరుగా మంత్రి బుధవారం సమావేశం నిర్వహించారు. సమకాలీన పాలన, రాజకీయాలపై ముఖ్య నేతలకు అవగాహన కల్పించి చైతన్య పరిచారు మంత్రి ఎర్రబెల్లి.
‘ తెలంగాణను బంగారు మయం చేయడానికి కంకణం కట్టకుని పని చేస్తున్నారు సీఎం కేసీఆర్. అలాంటి మహానాయకుడికి పుట్టిన రోజు కానుకగా పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటాలన్నారు. రికార్డు సృష్టించేలా మొక్కలు నాటాలని సూచించారు. ఇందుకు పార్టీ శ్రేణులతోపాటు, ప్రజలను సమాయత్తం చేయాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. ఇందుకునుగుణంగా పాలకుర్తి నియోకవర్గంలో పార్టీ సభ్యత్వాన్ని సాధ్యమైనంత ఎక్కువగా చేసేలా కృషి చేయాలన్నారు. రాష్ట్రానికే ఆదర్శంగా నెంబర్ వన్ గా నిలపేలా సభ్యత్వాలు ఉండాలని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. పార్టీని బలంగా ఉంచడమే గాక, వెన్నెముక లాగా ఉండే పార్టీ శ్రేణులను మరింతగా పెంచుకోవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ సభ్యత్వంలో టీఆర్ఎస్ నెంబర్ వన్ గా ఉందన్నారు. అయితే, ఇందులో కూడా పాలకుర్తి నియోజకవర్గాన్ని నెంబర్ వన్ గా నిలపాలని మంత్రి ఎర్రబెల్లి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను కోరారు.
ఇప్పటికే వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించిన సమాయత్త సమావేశాలు, ఓటర్ల నమోదు వంటి కార్యక్రమాలను పూర్తి చేశామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోగా, పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఇన్ చార్జీలను అప్రమత్తం చేయాలన్నారు. ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా అందకు సిద్ధంగా ఉండాలి’అని మంత్రి ఎర్రబెల్లి పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు.
ఈ సమావేశాల్లో పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, పెద్ద వంగర, రాయపర్తి, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల ఆరు మండలాకు చెందిన పార్టీ అధ్యక్షులు, కార్యవర్గం, ఇతర నేతలు, మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.