హైదరాబాద్ : మహిళలు ఆర్థికంగా బలపడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం
సోమాజిగూడ లోని పార్క్ హోటల్ లో దళిత్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఏడాది పొడవునా, ప్రతి రంగంలో మహిళలకు ప్రాధాన్యత దక్కాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు రకరకాలుగా వివక్ష కు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత మహిళల పై కుల వివక్ష సైతం ఉందని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రతి విషయంలో సమాజానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రపంచం మొత్తం మీద రెండే కులాలున్నాయి. ఒకటి డబ్బు ఉన్నవాళ్లు, రెండు పేద వాళ్ల అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆర్థిక స్వావలంబనతో మహిళలకు నిర్ణయాధికారం పెరుగుతుందని కవిత వివరించారు.
టీ- ప్రైడ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం దళిత మహిళలు పారిశ్రామికంగా ఎదిగేందుకు ఆర్థిక చేయూతనిస్తోందని పేర్కొన్నారు. డిక్కీ అనేక మంది దళిత పారిశ్రామికవేత్తలను తయారు చేస్తోందన్నారు. డిక్కీ , తెలంగాణ సమాజానికి చేస్తున్న సేవలకు ఎమ్మెల్సీ కవిత అభినందనలు తెలిపారు.