గేదె కళేబరంపై ఎక్కడంతో ఆటో బోల్తా: నలుగురు మృతి

తర్లుపాడు: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి నలుగురు మృతిచెందారు. తర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ వద్ద ఒంగోలు- కర్నూలు రహదారిలో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై పడి ఉన్న గేదె కళేబరంపై ఆటో ఎక్కడంతో అది బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా,  మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  మృతిచెందిన వారు దర్శి గ్రామానికి చెందిన పొట్లపాటి సారమ్మ, గొంగటి మార్తమ్మ, ఇత్తడి లింగమ్మ, ఆటో డ్రైవర్ వేంకటేశ్వర రెడ్డిగా గుర్తించారు.

ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 14 మంది ప్రయాణికులు ఉన్నారు. బెస్తవారిపేట మండలం కొత్తపల్లిలో కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.