రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్
వరంగల్ టైమ్స్, రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారిని దర్శించుకుని, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనాలను అందించారు.రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వారి దీవేనతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.