సీఎం వరంగల్ టూర్ రద్దు ఎందుకైంది ?

సీఎం వరంగల్ టూర్ రద్దు ఎందుకైంది ?హైదరాబాద్ : కొన్ని అనివార్య కారణాల వల్ల కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన రద్దైంది. సీఎం కేసీఆర్ ఈ రోజు నిర్వహించాలనుకున్న వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ పర్యటనను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వ్యవసాయశాఖ అధికారులు ఫీల్డ్ విజిట్ చేయనున్నారు. నష్టపోయిన రైతులను స్వయంగా కలవడంతో పాటు, పంట పొలాలను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అధికార బృందం వడగండ్లతో వానతో దెబ్బతిన్న పంటలను ఫీల్డ్ విజిట్ చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.

అయితే వడగండ్ల వర్షంతో పరకాల, నర్సంపేట, భూపాలపల్లి నియోజకవర్గాల్లోని 18 మండలాల్లో పంటలకు పూర్తిగా నష్టం వాటిల్లింది. మిరప, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు, కందిపంటలకు 100శాతం నష్టం వాటిల్లినట్లు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతాల్లో 960 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు.

తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంటలన్నీ నీటి పాలయ్యాయి. దీంతో రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అకాల వర్షం కారణంగా ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వందలాది హెక్టార్లలో పలు పంటలకు నష్టం జరిగింది.

ఈ విషయంపై సోమవారం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న రైతుల పంటలను పరిశీలించాలని సీఎం భావించిన విషయం తెలిసిందే.