స్పందించిన చీఫ్ విప్..సమస్యల పరిష్కారానికి హామీ

స్పందించిన చీఫ్ విప్..సమస్యల పరిష్కారానికి హామీహనుమకొండ జిల్లా : హౌస్ సర్జన్ మరియు విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ స్పందించారు. హుటాహుటిన సోమవారం అర్ధ రాత్రి ఒంటి గంటకు కాకతీయ మెడికల్ కాలేజ్ కి చేరుకుని వైద్య విద్యార్థులు, అధికారులతో మాట్లాడారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాకతీయ మెడికల్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద ఎంజీఎం హౌస్ సర్జన్ మరియు పీజీ విద్యార్థులు పలు సమస్యలపై ధర్నా చేపట్టారు. దీంతో ఆగ్రహించిన అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారని జూనియర్ మహిళా వైద్యులు చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కి ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

అర్థరాత్రి వైద్య విద్యార్థుల ఫోన్ కాల్ కు స్పందించిన దాస్యం వినయ్ భాస్కర్ తక్షణమే కాకతీయ మెడికల్ కాలేజ్ కి చేరుకున్నారు. ధర్నా చేపట్టిన వైద్య విద్యార్థులు, అధికారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి విద్యుత్ అంతరాయం లేకుండా చేశారు. వైద్య విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారి సమస్యలను పరిష్కరిస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. దీంతో బాధిత వైద్య విద్యార్థులంతా తిరిగి హాస్టల్ లోకి వెళ్లారు. అర్ధరాత్రి స్పందించి కాకతీయ మెడికల్ కాలేజీ కి వచ్చినందుకు హౌస్ సర్జన్ మరియు పీజీ విద్యార్థులు చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కి కృతజ్ఞతలు తెలిపారు.