మానవత్వం వెల్లువెరిసింది. పునర్వికకు పునర్జన్మ!
-పునర్వికకు పునర్జన్మ కోసం మానవత్వం వెల్లివిరిసింది
-సోషల్ మీడియా క్యాంపెయిన్ విజయవంతమైంది
-చిన్నారికి అవసరమైన డబ్బులు సమకూరాయి
-వీడియో విడుదల చేసిన పునర్విక తండ్రి సురేష్
వరంగల్ టైమ్స్, కర్నూలు జిల్లా: చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు మానవత్వం వెల్లివిరిసింది. తెలుగు రాష్ట్రాలు ఒక్కటై చేసిన ప్రయత్నం విజయవంతమైంది. సోషల్ మీడియా వేదికగా చేసిన ఫండ్ రైజింగ్ కూడా విజయవంతమయ్యింది. చిన్నారి ట్రీట్మెంట్కు అవసరమైన డబ్బులు సమకూరినట్లు పునర్విక తండ్రి సురేష్కుమార్ తెలిపారు. ఇక ఎవరూ డబ్బులు కలెక్ట్ చేయొద్దని కోరారు. ప్రస్తుతం పాప ఆస్పత్రిలో ఉందని, నాలుగైదు రోజుల్లో మొత్తం అప్డేట్ ఇస్తానని చెప్పుకొచ్చారు. SavePunarvika (సేవ్ పునర్విక ) తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా ఈ నినాదం మార్మోగింది. సోషల్ మీడియా వేదికగా హోరెత్తింది. రెండు రాష్ట్రాల్లో ప్రజలు 11 నెలల చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు ముందుకొచ్చారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లలో ఓ మహాయజ్ఞంలా సాగిన ఈ క్యాంపెయిన్ సక్సెస్ అయ్యింది. రూపాయి, రూపాయి కలిపి అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేశారు.
పాప ట్రీట్మెంట్కు అవసరమైన డబ్బుల్ని ఎట్టకేలకు కూడగట్టారు.అందరూ కలిసి ట్రీట్మెంట్కు అవసరమైన డబ్బుల్ని సేకరించారు. చిన్నారి పునర్వికకు పునర్జన్మను ప్రసాదించారు.కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్ కుమార్, పుష్పావతి దంపతులకు ఇద్దరు పిల్లలు. వారి కుమార్తె పునర్వికశ్రీకి అరుదైన కోట్లలో ఒకరికి వచ్చే ఎస్ఎమ్ఏ టైప్ 1(SMA Type-1) వ్యాధి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ వ్యాధికి సంబంధించి ట్రీట్మెంట్ కోసం ఇంజెక్షన్ రూ.16 కోట్లు అవుతుందని చెప్పారు. పేద కుటుంబానికి చెందిన సురేష్కుమార్ అంత డబ్బులు ఖర్చు చేయలేని పరిస్థితి ఉంది. వెంటనే ప్రభుత్వాన్ని, అధికారుల్ని కలిసి సాయం చేయమని కోరారు. ఆ తర్వాత ఈ విషయం తెలిసి సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు రంగంలోకి దిగారు. చిన్నారి ప్రాణాలు కాపాడాలంటూ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. విరాళాలు సేకరించి చిన్నారికి అవసరమైన డబ్బుల్ని సమకూర్చారు.అయితే పునర్విక ట్రీట్మెంట్కు అవసరమైన డబ్బులు సమకూరాయని పాప తండ్రి సురేష్కుమార్ ఓ వీడియోను విడుదల చేశారు.
ఇకపై ఎవరూ డబ్బులు ఇవ్వొద్దని, ఫండింగ్ను ఆపేయాలని,ఎవరూ డబ్బులు డొనేట్ చేయొద్దని ఆయన కోరారు. తన బిడ్డ ట్రీట్మెంట్ కోసం సాయం చేసిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. తన కూతురి ట్రీట్మెంట్కు అవసరమైన డబ్బుల కంటే ఎక్కువగానే సేకరించారని తెలిపారు. మిగిలిన డబ్బుల్ని ఎవరైనా పిల్లలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతుంటే వారికి సాయం చేస్తానని, తాను రూపాయి కూడా తీసుకోనని సురేష్ ప్రకటించారు. ప్రభుత్వం నుంచి కూడా కొంత సాయం అందిందని అన్నారు. తన పాప ప్రస్తుతం ఆస్పత్రిలో ఉందని తెలిపారు. నాలుగైదు రోజుల్లో తన కూతురు ఆరోగ్యం గురించి, ట్రీట్మెంట్పై అప్డేట్ ఇస్తానన్నారు.
వాస్తవానికి పాపకు అవసరమైన ఇంజెక్షన్ రూ.16 కోట్లు కాకుండా రూ.10 కోట్లలోపే ఖర్చయ్యేలా ఉందన్నారు. ఈ అంశాలపై త్వరలోనే పూర్తి వివరాలు చెబుతానన్నారు పాప తండ్రి సురేష్కుమార్. ఇంకా కొంతమంది దగ్గర వసూలు చేసిన డబ్బులు ఉన్నాయని.. వాటిపై కూడా త్వరలోనే అప్డేట్ ఇస్తామన్నారు.సోషల్ మీడియా వేదికగా కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు పాప కోసం క్రౌడ్ ఫండింగ్ మొదలు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజల దగ్గరకు వెళ్లి పాప పరిస్థితిని వివరించి డబ్బులు సేకరించారు. ముఖ్యంగా ట్రావెల్ విత్ జగదీష్ అనే ఇన్ఫ్లుయెన్సర్ ఒక్కరే చిన్నారి కోసం ఏకంగా రూ.కోటిన్నరకుపైగా సేకరించారు. మొత్తం డబ్బులు రూ.8కోట్ల 53 లక్షల 29వేల 500 సేకరించారు. ప్రభుత్వం నుంచి మిగిలిన సాయం అందింది. ఈ డబ్బులు పునర్విక ట్రీట్మెంట్కు సరిపోతాయని చెబుతున్నారు. ఓ చిన్నారి ప్రాణం కాపాడటంకోసం ప్రతి తెలుగువాడు ముందుకొచ్చాడు. ముఖ్యంగా యువత స్పందించడంతో అసాధ్యం కాదనుకున్నది సాధ్యమైంది.











