వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై నెలకొన్న సస్పెన్స్ వీడింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. మే నెలలో ఎంట్రన్స్ టెస్టులు జరగాల్సి ఉండగా కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్తో వాటిని జులైలో నిర్వహిస్తామని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీని ప్రకారం జులై 1న పాలిసెట్తో పాటు పీజీ ఈసెట్ పరీక్ష ప్రారంభం కావాల్సి ఉంది. జులై 4న ఈసెట్, జులై 6 నుంచి 9 వరకు ఎంసెట్, 10 న లాసెట్, 13న ఐసెట్, 15న ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష జరగాల్సి ఉంది. కాగా కరోనా కేసులు పెరుగుతున్నందున ఎంట్రెన్స్ టెస్టులను రద్దు చేయాలని కోరుతూ స్టూడెంట్ యూనియన్ నేతలు హైకోర్టులో పిల్ వేశారు. పిల్పై విచారణ సందర్భంగా రాష్ట్రంలో జరగనున్న వివిధ ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో రేపటి నుంచి జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి.