పకడ్బంధీగా ఇంటింటి జ్వర సర్వే : మంత్రి హరీష్ రావు

పకడ్బంధీగా ఇంటింటి జ్వర సర్వే : మంత్రి హరీష్ రావుహనుమకొండ జిల్లా : కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుండి ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కొవిడ్ నియంత్రణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

గ్రామాల వారీగా, వార్డుల వారీగా టీంలను ఏర్పాటు చేసి ప్రతీ రోజు 25 ఇండ్లల్లో ఇంటింటి సర్వే నిర్వహించాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఇంటింటి సర్వే టీంలలో సంబంధిత ఆశా వర్కర్/ ఏ.ఎన్.ఎం, మున్సిపల్/ గ్రామ పంచాయతీ సిబ్బందితో టీంను ఏర్పాటు చేయాలని సూచించారు. సర్వే టీంలు ప్రతీ ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో ఎవరైనా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా అని అడిగి తెలుసుకోవాలని తెలిపారు.

కొవిడ్ లక్షణాలతో బాధపడే వారుంటే వారిని గుర్తించి హోమ్ ఐసోలేషన్ కిట్ ను ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తున్న హోమ్ ఐసోలేషన్ కిట్ లోని మందులు చాలా బాగా పనిచేస్తున్నాయన్నారు. వాటిని 5 రోజులు వాడితే సరిపోతుందన్నారు. ఐసోలేషన్ కిట్ ఇచ్చిన వారిని సర్వే టీంలు ప్రతీ రోజు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. 5 రోజుల తర్వాత కూడా దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రులలో చేర్పించాలని ఆదేశించారు. గత అనుభవంతో ఇంటింటి సర్వేను పకడ్బంధీగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.

కొవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు. రెండవ డోస్ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా 95 శాతంపైగా వ్యాక్సినేషన్ పూర్తి చేసి ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగానికి, వైద్యాధికారులకు మంత్రి హరీష్ రావు అభినందనలు తెలిపారు. అదే విధంగా 15-17 యేళ్ల వయసు వారికి మొదటి డోస్ కొవిడ్ వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. అర్హులైన వారందరికి వంద శాతం వ్యాక్సినేషన్ చేయించాలని కోరారు. అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికి బూస్టర్ డోస్ వేయించాలని సూచించారు.

అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కొవిడ్ ఓ.పి. సేవలను నిర్వహించాలని ఆదేశించారు. కొవిడ్ లక్షణాలున్న వారందరికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందజేయాలని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కొవిడ్ టెస్టింగ్ కిట్స్, హోమ్ ఐసోలేషన్ కిట్స్, మందుల నిల్వలు ఉన్నాయని, లేనిచో వెంటనే ముందస్తుగా నిల్వ ఉంచుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ సౌకర్యంతో కొవిడ్ వార్డులను ఏర్పాటు చేసామని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్లతో రివ్యూ చేయాలని ఆదేశించారు. కొవిడ్ రోగులకు మంచి పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని ఆదేశించారు. పోలిస్ కమిషనర్లు, పోలిస్ సూపరింటెండెంట్లు ప్రజలందరూ మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామానికి ఒక నోడల్ ఆఫిసర్ ను నియమించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే టీంలలో ఆశా/ ఏ.ఎన్.ఎం.లతో గ్రామ పంచాయతి కార్యదర్శి, ఇతర అధికారుల సమన్వయంతో ఇంటింటి జ్వరం సర్వేను విజయవంతం చేయాలని ఆయన అన్నారు.

ఇంతవరకు కొవిడ్ తో మరణించిన వారికి ప్రభుత్వం చెల్లించు ఎగ్జి గ్రేషియా (ఆర్థిక సహాయం) త్వరగా మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. ఎగ్జి గ్రేషియా మంజూరుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఉన్నాయని అన్నారు. మీ సేవ ద్వారా ధరఖాస్తు చేసుకున్న కేసులను కమిటీ వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రతీ జిల్లాలో కొవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని తెలిపారు. కొవిడ్ సెంటర్లలో డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని కోరారు. కోవిడ్ సెంటర్లలో ఉన్న రోగులకు పౌష్టికాహారంతో కూడిన ఆహారం అందించాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్సులో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ సంధ్యా రాణి, డీఎంహెచ్ఓ లలితా దేవి, డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్, డిపిఓ జగదీశ్వర్, డా.కృష్ణారావు, మున్సపాల్ సుపర్ వైజర్స్ సాంబయ్య, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.