పట్టిస్తే రూ.20 లక్షల రివార్డు
వరంగల్ టైమ్స్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా: మావోయిస్టు పార్టీ రాష్ట్ర అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ను పట్టుకోవడమే టార్గెట్గా పోలీసులు వల పన్నుతున్నారు. పక్కా సమాచారం ఇస్తే రూ.20 లక్షల రివార్డు ఇస్తామంటూ వాల్పోస్టర్లు, పాంప్లెట్స్ ముద్రించి గ్రామాల్లో పంచిపెడుతున్నారు. దామోదర్ వారం కింద ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించారన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో మూడు జిల్లాల పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 20 ప్రత్యేక పోలీసు బృందాలు ఇప్పటికే కూంబింగ్ జరుపుతున్నాయి. ప్రతిరోజు సుమారు 500 మంది పోలీసులు గొత్తికోయ గూడెంలలో తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్టుల కదలికలను ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా సేకరిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నిరంతరం వెహికల్స్తనిఖీ, కల్వర్టుల చెకింగ్ నిర్వహిస్తున్నామని, మావోయిస్టులకు ఎవరు సహకరించవద్దని స్థానిక ప్రజలను కోరుతున్నారు. దామోదర్ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే రూ.20 లక్షల రివార్డు అందచేస్తామని భూపాలపల్లి-ములుగు జిల్లాల ఓఎస్డీ శోభన్ కుమార్ తెలిపారు.