బిగ్‌బాస్‌ నిర్వాహకులకు పోలీసుల నోటీస్

బిగ్‌బాస్‌ నిర్వాహకులకు పోలీసుల నోటీస్

 

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : బిగ్‌బాస్‌ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు డిసెంబర్ 25న ( సోమవారం) నోటీసులు జారీ చేశారు. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్-7 ఫైనల్స్ టైంలో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాల ధ్వంసంపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ ఘటనలపై యాజమాన్యం ఎండమోల్ షైన్ కు తాజాగా 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. విచారణ అధికారి ముందు మూడ్రోజుల్లో హాజరుకావాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో రెండు కేసులు నమోదయ్యాయి. నమోదైన రెండు కేసుల్లో ఇప్పటివరకు 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మరోవైపు పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన కేసులో డిసెంబర్ 25న మరో ముగ్గురు అరెస్టయ్యారు. సరూర్ నగర్ కు చెందిన విద్యార్థి అవినాష్ రెడ్డి, యూసఫ్ గూడకు చెందిన సుధాకర్, పవన్ లను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఇక బిగ్‌బాస్‌ తెలుగు సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ కు రెండ్రోజుల క్రితం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతీ ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు హాజరై, సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆర్టీసీ బస్సులపై దాడి, ధ్వంసం కేసులో 12 మంది నిందితులు సైతం బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు.