రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎస్సీ ,ఎస్టీ ,బీసీ మైనార్టీల పట్ల వివక్షత చూపుతూ రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్ర చేస్తోందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్య సంస్థల్లో ఐఐటీ లో రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.గోపాలరావు (ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ ) ఆధ్వర్యంలో కమిటీ వేసి కేంద్రీయ విద్య సంస్థలు, ఐఐటీ లాంటి విద్యా సంస్థల్లో టీచర్ రిక్రూట్మెంట్లో CEI Act -2019 Section- 4లో ఐఐటీ లను చేర్చాలని వాటిలో రిజర్వేషన్లు ఎత్తివేయాలని రికమాండ్ చేసిందన్నారు. 2015 బీహార్ ఎన్నికల సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లు ఇంక ఎన్నాళ్లు ? వాటిని ఎవర్ని బలి చేసి కొనసాగిస్తారు అని అన్నారని విమర్శించారు.
దీనిని బట్టి మొదటి నుంచి ఆర్ఎస్ఎస్, బీజేపీలు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నాయని అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. నీట్ (మెడికల్ ప్రవేశ పరీక్ష) ఇచ్చే కోటా లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదని దీని వల్ల 10వేల ఎంబీబీఎస్ సీట్లను బీసీలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ లకు పొలిటికల్ రిజర్వేషన్లు కల్పించడం కోసం పార్లమెంట్ లో ఎందుకు చట్టం చేయడం లేదని పిడమర్తి ప్రశించారు. ఈ సమావేశంలో ఆయన వెంట నాయకులు ఉన్నారు.