నిర‌స‌నలతో బీజేపీకి వణుకు పుట్టాలి: ఎర్రబెల్లి

నిర‌స‌నలతో బీజేపీకి వణుకు పుట్టాలి: ఎర్రబెల్లిఢిల్లీ : ధాన్యం సేక‌ర‌ణ‌లో కేంద్ర వైఖ‌రిని నిర‌సిస్తూ సోమ‌వారం గ్రామ గ్రామాన నిర‌స‌న కార్య‌క్ర‌మాలు, చావు డ‌ప్పులు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వ‌హించి నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పిలుపునిచ్చారు.

ఆదివారం నిర‌స‌న కార్య‌క్ర‌మంపై ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ప్ర‌జాప్ర‌తినిధుల‌తో మంత్రి టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు ప్ర‌తీ గ్రామంలో నిర‌స‌న కార్య‌క్ర‌మం జ‌రిగే విధంగా ఆయా నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయ‌కులు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని ద‌యాక‌ర్ రావు సూచించారు.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతాంగానికి చేయూతనిస్తూ వ్యవసాయం పండుగగా మారే విధంగా చేశార‌ని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్‌, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పుష్కలంగా సాగునీరు, రైతు బంధు, సకాలంలో ఎరువులు, విత్తనాలు దొరికే విధంగా చేశార‌ని తెలిపారు. లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయ‌ని, రాష్ట్రంలో పంట దిగుబడి గణనీయంగా పెరిగింది.

వానాకాలం వడ్ల కొనుగోలు విషయంలో అస్పష్టమైన , గందరగోళం చేస్తూ, అయోమయపరుస్తుంద‌ని ద‌యాక‌ర్ రావు ఆరోపించారు. తాను ఇత‌ర మంత్రుల బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రుల నిల‌దీస్తామ‌ని ద‌యాక‌ర్ రావు తెలిపారు. తాను ఢిల్లీలో ఉన్నందున ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన‌లేకపోతున్నట్లు తెలిపారు.

పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో మాజీ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి పాల్గొంటార‌ని దయాక‌ర్ రావు తెలిపారు. రాష్ట్ర రైతాంగాన్ని అయోమయానికి, ఆందోళనకు గురిచేసే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఊరువాడలో చావు డప్పు కార్యక్రమంలో పాల్గొన‌డానికి రైతులు సిద్ధంగా ఉన్నార‌ని చెప్పారు.

ఈ టెలికాన్ఫ‌రెన్స్‌లో మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌, మాజీ ఉప ముఖ్య‌మంత్రులు క‌డియం శ్రీ‌హ‌రి, టి.రాజ‌య్య‌, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్క‌ర్‌, రైతు బంధు స‌మితి రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్యానాయ‌క్‌, శంక‌ర్ నాయ‌క్‌, ఆరూరి ర‌మేశ్‌, గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణా రెడ్డి, ఎమ్మెల్సీ బండ ప్ర‌కాశ్, ములుగు జ‌డ్పీ చైర్మ‌న్ కుసుమ జ‌గ‌దీశ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.