శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక

శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనికహైదరాబాద్ : శ్రీశైలం ఆలయ ఈవో లవన్న ముఖ్య ప్రకటన జారీ చేశారు. శ్రీశైలంలో కొలువు దీరిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని సూచించారు. ముఖ్యంగా ఉచిత స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే వస్తేనే గర్భగుడిలోకి అనుమతిస్తామని ఆలయ ఈవో స్పష్టం చేశారు. సామాన్య భక్తుల అభ్యర్థన మేరకు ఉచిత స్పర్శ దర్శనాలను రోజుకు రెండు సార్లు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.

కాగా మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు సాధారణ భక్తులకు ఉచితంగా స్పర్శ దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామని ఈవో లవన్న వెల్లడించారు. శ్రీశైలంలో ఫిబ్రవరి 22 నుంచి మార్చి 3 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ఈవో తెలిపారు.