గ్రూప్స్ ఉద్యోగ నియామకాల్లో కొత్త రూల్స్

గ్రూప్స్ ఉద్యోగ నియామకాల్లో కొత్త రూల్స్

గ్రూప్స్ ఉద్యోగ నియామకాల్లో కొత్త రూల్స్వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీపీఎస్‌సీ నిర్వహించే గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాల నియామకంలో కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్టు (సీపీటీ) సర్టిఫికెట్‌ ను తప్పనిసరి చేస్తూ పరిపాలనశాఖ కార్యదర్శి పోలా భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వంద మార్కులకు సీపీటీ నిర్వహించనున్నట్లు పోలా భాస్కర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియమితులయ్యే వారంతా ఏపీపీఎస్సీ లేదా ఏపీ సాంకేతిక విద్యా మండలి నిర్వహించే సీపీటీ పాస్‌ కావాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు 30 మార్కులు, బీసీలు 35, ఓసీలు 40 మార్కులు సాధించాల్సి ఉంటుందని వెల్లడించారు.

సీపీటీ పాస్ సర్టిఫికెట్‌ లేకుండా నియామకానికి అవకాశం లేదంటూ అడహాక్‌ నిబంధనలు ఉన్నాయన్నారు. కంప్యూటర్లు, డిజిటల్‌ పరికరాలు, ఆపరేటింగ్‌ సిస్టమ్స్ విండోస్‌, ఇంటర్నెట్‌ వంటి తదితర అంశాల్లో పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రూపు-1 ఉద్యోగాలకు ఈ తాత్కాలిక నిబంధనలు వర్తించవంటూ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.