సెక్రటేరియట్ పనులు స్పీడ్ గా జరగాలి : కేసీఆర్

సెక్రటేరియట్ పనులు స్పీడ్ గా జరగాలి : కేసీఆర్హైదరాబాద్ : సెక్రటేరియట్ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ గురువారం పరిశీలించారు. మంత్రుల చాంబర్లు, పార్కింగ్ స్థలాలు, సెక్రటరీ , వీఐపీల చాంబర్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని తెలిపారు. కారిడార్లు సహా గ్రౌండ్ ఫ్లోర్, మొదటి ఫ్లోర్, నిర్మాణంలో ఉన్న సెక్రటేరియట్ ప్రాంగణమంతా కలియదిరిగారు.

తుది దశ నిర్మాణంలో చేపట్టాల్సిన పనులతో పాటు, ఎలివేషన్ మోడళ్ల నాణ్యతను పరిశీలించారు. సచివాలయం బాహ్య అలంకరణలో భాగంగా గోడలకు వేసే గ్లాడింగ్ టైల్స్, గ్రానైట్స్, తదితర మోడల్లను అధికారులు ప్రదర్శనకు పెట్టారు. వాటిని నాణ్యతను కలర్ డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి ఎలివేషన్ ప్రకాశవంతంగా, సుందరంగా కనిపించేలా ఉండాలని సూచించారు.

వాల్ గ్లాడింగ్ టైల్స్, గ్రానైట్స్, యూపీవీసీ విండోస్, అల్యూమినియం ఫాబ్రికేషన్స్, మెట్లకు వేసే గ్రానైట్స్, ఫ్లోరైడ్ మార్బుల్స్, గ్రానైట్స్ పలు రకాల మోడళ్లను అధికారులు సీఎం కేసీఆర్ ఎదుట ప్రదర్శించారు. తన వెంట వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురి అభిప్రాయాలను తెలుసుకుని వాటిలో కొన్ని మోడళ్లను సీఎం ఫైనల్ చేశారు. మోడల్ వాటర్ ఫౌంటేన్, లాండ్ స్కేప్, విశ్రాంతి గదులు, మీటింగ్ హాళ్లను సీఎం పరిశీలించారు. స్కై లాంజ్ నిర్మాణం గురించి సీఎం కేసీఆర్ కు అధికారులు వివరించారు.

నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసేందుకు అనువైన వాతావరణం కల్పించేలా నిర్మించిన కార్యాలయాలు, విశాలమైన కారిడార్లను పరిశీలించిన సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. పలు రకాలుగా పరిశీలించి తాను సూచించిన మేరకు నిర్మాణం జరుగుతుండడం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఈఎన్సీ గణపతి రెడ్డిలను అభినందించారు. ప్రస్తుతం నడుస్తున్న పనితీరును అదే విధంగా ముందుకు కొనసాగించాలన్నారు.

సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలని, నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న సచివాలయ నిర్మాణాలను పరిశీలించాలని, అందులో మంచి అంశాలను స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ఆర్ అండ్ బీఈఎన్సీ గణపతి రెడ్డి, ఆర్ అండ్ బి శాఖ ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఆర్ అండ్ బీ, పోలీసు అధికారులు, నిర్మాణ ఏజెన్సీ ఫాపూర్ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.