బాలికల ప్రాణాలు తీసిన ఈత సరదా 

బాలికల ప్రాణాలు తీసిన ఈత సరదా

వరంగల్ టైమ్స్, మహబూబాబాద్ జిల్లా : ఈత సరదా రెండు ప్రాణాలను బలితీసుకుంది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారులు కొద్ది సేపట్లోనే విగతజీవులుగా మారడంతో రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాదకర సంఘటన మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం దుబ్బ తండాలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు, ఎస్సారెస్పీ డీబీఎం-48 కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లి ఇద్దరు బాలికలు మృతి చెందారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు.

అసలు విషయానికొస్తే.. బాలికలు కాలువపై గట్టు మీద పారతో తవ్వి గుంజను నాటారు. ఆ గుంజకు తాడు కట్టి కాలువలో దిగి ఈత కొట్టాలని నిర్ణయించారు. తాడు సాయంతో దిగుతుండగా, తాడు తెగి నలుగురు బాలికలు నీళ్లలో పడ్డారు. ఇందులో రమ్యశ్రీ ( 9 ), వాసంతి ( 12 ) ఇద్దరు బాలికలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇద్దరి బాలికల మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.