సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులు
ఢిల్లీ : సుప్రీం కోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులు నియమితులయ్యారు. అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలోనే నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయని చెప్పారు.కొత్త న్యాయమూర్తుల్లో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ఉన్నారు. అలాగే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న కొలీజియం జాబితాలో ఉన్నారు.
వీరితో పాటు కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీటీ రవికుమార్, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఎంఎం సుందరేశ్, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం.త్రివేది, సీనియర్ అడ్వకేట్ పీఎస్ నరసింహా ఉన్నారు. అధికారిక ఉత్తర్వులు వెలువడితే సోమవారం నాటికి కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.