మృతదేహంపై…చెప్పులు విసిరిన స్థానికులు

మృతదేహంపై...చెప్పులు విసిరిన స్థానికులువరంగల్‌‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్‌ హత్యాచార కేసు నిందితుడు రాజు మృతదేహం వరంగల్‌ ఎంజీఎం మార్చురీకి చేరింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ మృతదేహాన్ని కాజీపేట రైల్వే సీఐ రామ్మూర్తి ఆధ్వర్యంలో అంబులెన్స్‌లో తరలించారు. మృతదేహం మార్చురీకి చేరుకోగానే పోలీసులు మార్చురీ గేట్లు మూసివేశారు. ఈక్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్‌పై చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎంజీఎం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈరోజు ఉదయం స్టేషన్‌ఘన్‌పూర్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌పై రాజు బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత రాజు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఈమేరకు కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. రాజు కుటుంబ సభ్యులు వస్తే పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేయాలని ఆసుపత్రి వైద్యులు, పోలీసులు ఎదురు చూస్తున్నారు.

మృతుడి కుటుంబ సభ్యులు వచ్చి అతను రాజు అని గుర్తించాకే శవపరీక్ష చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే.. రాజు మృతదేహాన్ని చూసేందుకు కుటుంబ సభ్యులు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. నిందితుడు రాజు ఆత్మహత్యతో హైదరాబాద్‌లో సంబురాలు చేసుకుంటున్నారు. పలు చోట్ల నగరవాసులు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.