టీఎస్పీఎస్సీ పేపర్ లీక్.. 9 మంది అరెస్ట్

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్.. 9 మంది అరెస్ట్

వరంగల్ టైమ్స్,హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ను టాస్క్ ఫోర్స్, సెంట్రల్ జోన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇది గుర్తు తెలియని వ్యక్తులు చేసిన హ్యాకింగ్ కాదని, టీఎస్పీఎస్సీ లో పనిచేసే ఉద్యోగులేనని తేలింది. యువతి మాయలో పడి పేపర్ లీకేజ్ కు పాల్పడ్డారని నిర్ధారణ అయింది.టీఎస్పీఎస్సీ పేపర్ లీక్.. 9 మంది అరెస్ట్హిందీ టీచర్ గా పనిచేస్తున్న రేణుక అనే యువతి తన భర్త డాక్యతో కలిసి పెద్ద స్కెచ్ వేసింది. టీఎస్పీఎస్సీలో జరుగబోతున్న టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఎగ్జాంతో పాటు, మార్చి 15, 16 తేదీలలో జరిగే పశుసంవర్ధక శాఖలోని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షల పేపర్లను కాజేయాలని ప్లాన్ వేసింది. టీఎస్పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేసే ప్రవీణ్ తో చనువుగా మాట్లాడి టీఎస్పీఎస్సీలో జరిగే పరీక్షల పేపర్లను లీక్ చేసి తనకు ఇవ్వాలని దీనికి రూ. 10 లక్షలు ఇస్తామని గాలం వేసింది.

దీంతో ప్రవీణ్ టీఎస్పీఎస్సీలో నెట్వర్క్ అడ్మిన్ గా పనిచేసే రాజశేఖర్ తో కలిసి పేపర్ లీకేజ్ కు తెరతీశాడు. పేపర్లను మార్చి 2న రేణుకకు అందించాడు. అదే రోజు రేణుక నుంచి రూ. 5లక్షలు తీసుకున్నాడు. తర్వాత మార్చి 6న మరో రూ. 5లక్షలు తీసుకున్నాడు. ఈ డబ్బును ప్రవీణ్, రాజశేఖర్ లు పంచుకున్నారు. రేణుక, ఆమె భర్త కలిసి ఈ పేపర్లను అమ్ముకున్నారు. టీఎస్పీఎస్సీ సిస్టమ్ పాస్ వర్డ్ హాక్ అయిందని గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో మార్చి 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షతో పాటు మార్చి 15, 16 తేదీల్లో జరగాల్సిన అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ పరీక్షలను వాయిదా వేశారు. మొత్తంగా ఈ పేపర్ లీకేజ్ స్కాంలో ప్రధాన సూత్రదారులు రేణుక, ప్రవీణ్ తో పాటు మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 4 పెన్ డ్రైవ్ లు, 3 ల్యాప్ టాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.