తిరుపతి : రైతుల మేలు కోసమే బీజేపీ సర్కార్ నూతన వ్యవసాయ చట్టం తీసుకొచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతి పర్యటనలో భాగంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యలను జనసేన నాయకులు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ చట్టంతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. రైతులను బలోపేతం చేయడం.. వారికి కొత్త అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా సంస్కరణలు తేవడానికే ప్రధాని మోదీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని వ్యాఖ్యానించారు. రైతుల కిసాన్ బిల్లులో సవరణకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. కొందరు కావాలని ఈ చట్టంపై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యారని పవన్కల్యాణ్ ఆరోపించారు. తుఫాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారిని ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలన్నారు. తుఫాన్ నష్టపరిహారం ఎకరానికి రూ.35 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టంచేశారు. పంటనష్టంపై నివేదిక తయారు చేసి సాయం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతామని తెలిపారు. మద్యం, ఇసుకలో ప్రభుత్వం ఎంతో గడిసుతందని రైతుల సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. జైకిసాన్ పేరుతో రైతులకు అండగా ఉండేలా ప్రణాళికతో ముందుకెళ్తానని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కాదు.. లాభసాటి ధర రావాలని పేర్కొన్నారు.