విశాఖలో హవాలా నగదు కలకలం

విశాఖలో హవాలా నగదు కలకలం

విశాఖ జిల్లా : విశాఖలో హవాలా నగదు కలకలం రేపింది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జరిపిన తనిఖీల్లో వేర్వేరు చోట్ల భారీగా నగదుతో పాటు గంజాయి, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ ప్రేమ్‌కాజల్‌ వివరాలు వెల్లడించారు. విశాఖలో హవాలా నగదు కలకలంనగర పోలీసులు యాంటీ డ్రగ్‌ ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించగా ఈ తనిఖీల్లో 100 కిలోల గంజాయి, రూ.కోటి నగదు, 29.415కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గాజువాక ప్రాంతంలోని దువ్వాడ రైల్వే బ్రిడ్జి వద్ద దువ్వాడ పోలీసుల యాంటీ డ్రగ్‌ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా ఓ ఇన్నోవా కారులో 100 కిలోల గంజాయిని గుర్తించారు. కారుడ్రైవర్ గౌరవ్‌ (25)ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి సుబ్బారెడ్డి అలియాస్‌ సురేష్‌ తప్పించుకున్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు.

29.415 కిలోల వెండి భారీగా నగదు స్వాధీనం

విశాఖ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్లిపురం ప్రాంతంలోని ఓ లాడ్జిలోనూ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను గుర్తించిన వారు ఉంటున్న గదిలో తనిఖీలు నిర్వహించారు. దీంతో రెండు బ్యాగుల్లో 29.415 కిలోల వెండిపట్టీలు, కుంకుమ భరిణెలు లభ్యమయ్యాయి. వీటికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నిందితులు హిమత్‌ సింగ్‌ రాఠోడ్‌, సోహన్‌సింగ్‌లను అదుపులోకి తీసుకున్నారు. అల్లిపురం బైడరా రోడ్డులోని ఓ హోటల్‌లో నిర్వహించిన తనిఖీల్లో భరత్‌కుమార్‌, రాజ్‌పురోహిత్‌, చోటారామ్‌ల అనే వ్యక్తుల వద్ద ఓ బ్యాగును గుర్తించి తనిఖీలు చేయగా రూ.కోటి నగదు ఉన్నట్లు గుర్తించారు. నగదు సంబంధించి సరైన సమాధానం చెప్పకపోవడంతో దాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.