రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు  

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్’ నామ సంవత్సరం ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, దైవ కృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదని సీఎం కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఉగాది నుంచే నూతన సంవత్సరం ఆరంభమవుతుందని, రైతన్నలు తమ వ్యవసాయ పనులను ఉగాది నుంచే ప్రారంభించుకుంటారని సీఎం తెలిపారు.రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు  తెలంగాణ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయ రంగాలకు అత్యధికంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని పేర్కొన్నారు. రైతన్నల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని తెలిపారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో అనతికాలంలోనే దేశం గర్వించేలా కనీవినీ ఎరుగని అభివృద్ధిని సాధించిందని సీఎం అన్నారు. వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అనుబంధ వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని అన్నారు. వ్యవసాయం బాగుంటేనే సర్వజనులు సంతోషంగా ఉంటారనే సూక్తిని తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు.

కరోనా వంటి కష్టకాలంలోనూ తెలంగాణ వ్యవసాయరంగం దేశ జీడీపీకి దోహదపడడంలో ముందుందని వెల్లడించారు. తెలంగాణ ఉత్పత్తి సేవా రంగాల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవ్వడంలో, వ్యవసాయ రంగం పరోక్ష పాత్రను పోషిస్తుందని సీఎం పేర్కొన్నారు. అనతి కాలంలోనే అన్ని రంగాలను పటిష్టపరుచుకున్నామనీ, ‘శుభకృత్’ నామ సంవత్సరంలో తెలంగాణ మరింత గొప్పగా అభివృద్ధి సాధించనున్నదని అన్నారు. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని సీఎం కేసీఆర్ తెలిపారు.