బోరుబావిలో పడిన బాలుడి మృతి

బోరుబావిలో పడిన బాలుడి మృతి

పాపన్నపేట: మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలో బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన బాలుడు సాయివర్ధన్ కథ విషాదాంతమైంది.‌ 17 అడుగుల లోతు నుంచి గురువారం ఉదయం 5.45 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెలికితీశాయి. ఆక్సిజన్‌ అందకపోవడం వల్లే  బాలుడు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు ఆక్సిజన్‌ పైపులోనికి పంపి బాలుడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసినప్పటికీ అవేమీ ఫలించలేదు.150 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో సాయివర్థన్‌ 25 అడుగుల లోతున ఉండొచ్చని భావించి.. బావికి సమాంతరంగా పొక్లెయిన్లతో  మరో గొయ్యి తవ్వి దాదాపు  ఎనిమిదన్నర గంటల పాటు సహాయక బృందాలు శ్రమించినా ఫలితం లేకపోయింది. అప్పటికే సాయివర్ధన్‌ ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టరు ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి, ఆర్డీవో సాయిరాం సహాయక చర్యలు పూర్తయ్యే వరకు సంఘటన స్థలంలోనే ఉండి పర్యవేక్షించారు. బోర్లు విఫలమైతే వెంటనే పూడ్చివేయాలని రైతులకు ఎమ్మెల్యే సూచించారు. అనుమతి లేకుండా బోర్లు వేసిన రిగ్గు యజమానిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వెల్లడించారు.