ఎట్టకేలకు క‌థ సుఖాంతం

ఎట్టకేలకు క‌థ సుఖాంతం

ఎట్టకేలకు క‌థ సుఖాంతం

warangaltimes, అనంత‌పురం : ఎంతో ఉత్కంఠ క‌లిగించిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో చివ‌ర‌కు గెలిచిన టీడీపీ అభ్య‌ర్ధికి డిక్లరేష‌న్ ప‌త్రం ఇవ్వ‌డంతో సుఖాంత‌మైంది. రెండో ప్రాధాన్య‌త ఓట్లు లెక్కింపు అనంత‌రం ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7,543 ఓట్ల మెజార్టీ సాధించారు. 3 రోజులపాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో చివరకు టీడీపీ అభ్యర్థినే విజయం వరించింది. అయితే టీడీపీ అభ్య‌ర్ది గెలిచినప్పటికీ ఎన్నికల అధికారులు డిక్లరేషన్‌ ఇవ్వలేదు. రాంగోపాల్‌ రెడ్డి గెలిచారని స్వయంగా ప్రకటించిన అధికారులు అనంతరం వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి నుంచి నిరసన వ్యక్తం కావడంతో క‌లెక్ట‌ర్ ఏ నిర్ణ‌యం తీసుకోలేదు.

దీంతో భూమిరెడ్డికి ఎంతకీ డిక్లరేషన్‌ ఇవ్వకపోవడంతో టీడీపీ నేతలు ఆందోళకు దిగారు. భారీ మెజార్టీతో గెలిచిన తమ పార్టీ అభ్యర్థిని అభినందించేందుకు టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరిటాల సునీత తదితరులు జేఎన్‌టీయూ కౌంటింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లారు. దాదాపు 3 గంటల పాటు డిక్లరేషన్‌ ఫారం కోసం వేచిచూశారు. రీ కౌంటింగ్‌ కోరుతూ వైసీపీ వర్గీయులు ధర్నా చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అధికార పార్టీ ఒత్తిళ్లతో ఎన్నికల అధికారులు ఏదో చేస్తున్నారని టీడీపీ వర్గీయుల్లో ఆందోళన మొదలైంది. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు జేఎన్‌టీయూ ప్రధాన ద్వారం వద్ద రాత్రి 11.20 సమయంలో భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డితో కలిసి బైఠాయించారు. టీడీపీ అభ్యర్థికి వెంటనే డిక్లరేషన్‌ ఫారం ఇవ్వాలని కాలవ, పరిటాల సునీత డిమాండ్‌ చేశారు.

ఈ సమయంలో రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయేందుకు కారులో వచ్చారు. టీడీపీ శ్రేణులు అడ్డుగా వెళ్లడంతో ఆమె తిరిగి కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లారు. ఆ తర్వాత జేసీ కేతన్‌ గార్గ్‌ వాహనాన్ని కూడా టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఉద్రికత ఏర్పడింది. అర్ధరాత్రి సమయంలో కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత సహా టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల్లో గెలిచారని అధికారులు స్వయంగా ప్రకటించిన భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డిని బలవంతంగా ఈడ్చుకువెళ్లి పోలీసులు వ్యానులో పడేశారు. వీరిని అనంతపురం త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంత‌రం నేటి ఉద‌యం క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మీ గెలిచిన టీడీపీ అభ్య‌ర్ది భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డికి గెలుపు ప‌త్రాన్ని అంద‌జేశారు.