ముంబై: బాలీవుడ్ సూపర్స్టార్, బిగ్బీ అమితాబ్ బచ్చన్ (77)కు కరోనా వైరస్ సోకింది. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా కొవిడ్ బారిన పడ్డారు. ముంబైలోని నానావతి దవాఖానలో వారికి చికిత్స అందిస్తున్నారు. ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. నా కుటుంబసభ్యులు, ఉద్యోగులకు కూడా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు తెలియాల్సి ఉంది. పదిరోజులుగా నాతో మెలిగినవారు కరోనా పరీక్షలు చేయించుకోండి’ అని శనివారం రాత్రి అమితాబ్ ట్వీట్ చేశారు. తాను బాగానే ఉన్నానని తెలిపారు.‘శనివారం ఉదయం నాకు, నాన్నకు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ఓ మోస్తరు కరోనా లక్షణాలు ఉన్నందున దవాఖానలో చేరాము. ఎవరూ ఆందోళన పడకండి’ అని అభిషేక్ ట్వీట్ చేశారు. అమితాబ్కు కిడ్నీ సమస్యతోపాటు పలు ఆరోగ్యసమస్యలు ఉన్నట్టు సమాచారం. కౌన్బనేగా కరోడ్పతి ప్రమోషన్ షూటింగ్లో ఇటీవలే అమితాబ్ పాల్గొన్నారు. తన ఇంట్లోనే జరిగిన ఈ షూటింగ్ సందర్భంగా ప్రోగ్రాం టీం ఆయనతో సన్నిహితంగా మెలిగింది. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తటంతో అమితాబ్ శనివారం సాయంత్రం దవాఖానలో చేరారని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.