హైస్కూళ్లలో నైట్ వాచ్ మెన్ల నియామకానికి ఓకే

హైస్కూళ్లలో నైట్ వాచ్ మెన్ల నియామకానికి ఓకే

హైస్కూళ్లలో నైట్ వాచ్ మెన్ల నియామకానికి ఓకేవరంగల్ టైమ్స్, అమరావతి : అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా జరిగిన ఏపీ కేబినెట్‌ భేటీలో పలు అంశాలకు ఆమోద ముద్ర పడింది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో 45 అంశాలపై చర్చించగా, 15 అంశాలకు ఆమోదం లభించింది. దీనిలో భాగంగా కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రి వేణు గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.

విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతం కావడంపై సీఎం జగన్‌ను మంత్రులు అభినందించారని వేణు గోపాలకృష్ణ తెలిపారు. ఆస్కార్‌ అవార్డు సాధించిన నాటు నాటు పాట బృందానికి సీఎం జగన్ కేబినెట్‌లో అభినందనలు తెలిపారన్నారు. ఏప్రిల్‌ 1న ఆర్బీఐ సెలవు, 2 న ఆదివారం కావడంతో ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ఏప్రిల్ 3న ఉంటుందన్నారు.

* విశాఖను రాజధానిగా ఆహ్వానించారు :
పారిశ్రామిక దిగ్గజాలు, కేంద్ర మంత్రులు కూడా విశాఖను రాజధానిగా ఆహ్వానించిన విషయాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ మరోసారి తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలోనే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లోనూ విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందని చెప్పారన్నారు. ఈ రోజు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా గవర్నర్‌ ప్రసంగం కొనసాగుతుండగా టీడీపీ సభ్యులు ఎందుకు వెళ్లిపోయారో అర్థం కాలేదన్నారు మంత్రి. వారు రాజకీయ పరిణితి కోల్పోయినట్లు కనిపిస్తోందని, పోలవరంలో తప్పులు చేసింది చంద్రబాబేనన్నారు.

* ఏపీ కేబినెట్‌లో ఆమోదించిన పలు అంశాలు ఇవే :
-జిల్లా గ్రంథాలయాల సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంపు.
-ఎయిడెడ్ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం.
– 5,388 హైస్కూళ్ళల్లో నైట్ వాచ్ మెన్ల నియామకానికి ఆమోద ముద్ర పడింది. వారికి నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం నిర్ణయించబడింది.
-టాయిలెట్ నిర్వహణా నిధి నుంచి చెల్లించే విధంగా నిర్ణయించారు.
-ఏపీఐఐసీ చేసిన 50 ఎకరాలలోపు కేటాయింపులను క్యాబినెట్ ర్యాటిఫై చేసింది.
-అమలాపురం కేంద్రంగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కు క్యాబినెట్ ఆమోదం.
-ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం బిల్లు – 2023 కు ఆమోదం.
-ఎక్సైజ్ చట్టం సవరణకు ఆమోదం.
-అన్ని దేవస్థానాల బోర్డులలో ఒక నాయీ బ్రాహ్మణుడిని సభ్యుడిగా నియమించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెల్పింది.
-దేవాలయాల్లో క్షుర ఖర్మలు చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీసం నెలకు రూ.20వేలు కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెల్పింది. కనీసం వంద పనిదినాలు ఉన్న క్షురకులకు ఇది వర్తింపు చేస్తుందన్నారు..
-పట్టాదారు పాస్ బుక్స్ ఆర్డినెన్స్-2023 సవరణకు కేబినెట్ ఆమోదం తెల్పింది.