రేపు సీఎం కేసీఆర్ మేడారం రాక

దారులు అన్ని మేడారం వైపు..
వన దేవతల సేవలో ప్రముఖులు..
నేడు సమ్మక్క తల్లి రాక..
ఎదురుస్తున్న భక్తకోటిజనం.రేపు సీఎం కేసీఆర్ మేడారం రాకవరంగల్ టైమ్స్,ములుగు జిల్లా: బుధవారం రోజున మేడారం జాతర మహా ఘట్టం మొదలు అయ్యింది. బుధవారం రోజున సారక్క తల్లి గద్దెల మీదకు వచ్చి భక్తులకు దర్శనం ఇచ్చింది. భక్త కోటి జనం అంత మేడారం చేరుకుంటున్నారు. ఈరోజు సమ్మక్క తల్లి గద్దె మీదకు రానుంది. తల్లి రాక కోసం భక్తులు మేడారంలో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జనవరి మొదటి వారం నుంచి ఇప్పటి వరకు సుమారు 70 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా సుమారు 60 నుండి 70 లక్షల మంది దర్శనం కోసం జాతరకు వచ్చే అవకాశాలున్నాయని ప్రభుత్వం అంచనాలతో సౌకర్యాలు కల్పించారు.

ఇక మేడారంలో రాష్ట్ర మంత్రులుఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, స్థానిక ఎమ్మెల్యే సీతక్క తదితర ప్రముఖులు వనదేవతల సేవలో తరించిపోతున్నారు. బుధవారం సారలమ్మ తల్లిని దర్శించుకున్నారు. అక్కడే బస చేస్తూ ఎప్పటికప్పుడు మేడారంలో పర్యవేక్షిస్తూ భక్తుల సౌకర్యాలు పరిశీలిస్తున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా పర్యవేక్షణ చేస్తున్నారు. రేపు సీఎం కేసీఆర్ మేడారం చేరుకొని సుమారు రెండు గంటల పాటు మేడారం తల్లుల సేవలో గడపనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన తల్లులకు మొక్కులు చెల్లించనున్నారు. ఈనేపథ్యంలో మేడారంలో అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది.