తక్షణ సహాయక చర్యలకు సన్నద్ధం కావాలి…
వర్షాలు అనంతరం పంట నష్టంపై అంచనాలు రూపొందించాలి
తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష అమరావతి: నివర్ తుపాను ప్రభావంపై సీఎం వైయస్ జగన్ అధికారులతో సమీక్షించారు. తుఫాను నేఫధ్యంలో భారీ వర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలో విద్యుత్తు షాకుతో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదేశాలు జారీచేశారు. వర్షాలు అనంతరం పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని, భారీ వర్షాలు కారణంగా ఏదైనా నష్టం వస్తే.. సత్వరమే సహాయం అందించడానికి సిద్ధం కావాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. గురువారం ఉదయం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు. తుపాను ప్రభావం, దీనివల్ల కురుస్తున్న వర్షాలపై సీఎంఓ అధికారులు ఆయనకు వివరాలు అందించారు. తుపాను తీరాన్ని తాకిందని, క్రమంగా బలహీనపడుతోందని వివరించారు. తీవ్రత కూడా తగ్గతోందన్నారు. చిత్తూరులోని ఏర్పేడు, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలో వర్షాలు పడుతున్నాయని, అలాగే కడప, అనంతపురం జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలు ప్రారంభం అయ్యానన్నారు. నెల్లూరు జిల్లాలో సగటున 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని ముఖ్యమంత్రికి తెలిపారు. పెన్నాలో ప్రవాహం ఉండొచ్చని, సోమశిల ఇప్పటికే నిండినందున వచ్చే ఇన్ఫ్లోను దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేస్తామని సీఎంఓ కార్యాలయ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అక్కడక్కడా పంటలు నీటమునిగిన ఘటనలు వచ్చాయని, వర్షాలు తగ్గగానే నష్టం మదింపు కార్యక్రమాలు చేపడతామన్నారు. రేణిగుంటలో మల్లెమడుగు రిజర్వాయర్ సమీపంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.