కరోనాలో ప్రభుత్వం కీలక నిర్ణయం

హైద‌రాబాద్: కరోనా మహామ్మారి కోరలు చాస్తోన్న ప్రస్తుత నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంతో సహా ఇతర హెచ్ఓడీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ ద్వారా సులభతర పరిపాలన మొదలుపెట్టబోతోంది. రేపటిలోగా ఉద్యోగుల మాస్టర్ డేటా బేస్ రూపొందించాలని, ఈ ఆఫీస్ కు అవసరమయ్యే సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ల వివరాలు, డిజిటల్ సంతకాలను సేకరించాలని వివిధ శాఖలకు నోట్ జారీ చేసింది. ఈ ఆఫీస్ నిర్వహణ కోసం 6 వ తేదీలోగా ప్రతిశాఖకు ఒక నోడల్ అధికారిని, సాంకేతిక సహాయకుడిని కూడా నియమించే విధంగా ఆదేశాలిచ్చింది. జూలై రెండోవారం నుంచి ఈ ఆఫీస్ ద్వారా పరిపాలన మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం అన్ని కార్యాలయాల్లో వచ్చేవారం నుంచి ఈ ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తోన్న ప్రస్తుత తరుణంలో అధికారిక లావాదేవీలు ఆన్ లైన్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం కీలక పరిమాణం. ఫైళ్ల నిర్వహణ భౌతికంగా జరగడం ద్వారా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే ప్రమాదం ఉందని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆఫీస్ ద్వారా ఫైళ్ల నిర్వహణ సులభతరమయి పారదర్శకత, విశ్వసనీయతలు కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.కరోనాలో ప్రభుత్వం కీలక నిర్ణయంఅందుకే రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎక్సయిజ్, కమర్షియల్ టాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎండోమెంట్ శాఖల్లో ముందుగా ఈ ఆఫీస్ ప్రక్రియను ప్రవేశ పెట్టనుంది. తరవాత ఇతర శాఖలకు దాన్ని విస్తరించనుంది. ఇందుకోసం అవసరమైన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ సరంజామాను సమకూర్చుకోవడంతో పాటు ఉద్యోగుల మాస్టర్ డేటాబేస్, హైరార్కీ మ్యాపింగ్, వాళ్ళ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లాంటి వివరాలతోపాటు ఈ ముద్ర అప్లికేషన్ ద్వారా వాళ్ళ డిజిటల్ సంతకాలను ఈనెల 6 వ తేదీలోగా ప్రతిశాఖకు ఒక నోడల్ అధికారిని నియమించి, 7 వ తేదీ లోగా సేకరించి సిద్ధంగా ఉంచుకోవాలని వివిధ శాఖలకు సూచించింది. ఈనెల 8 వ తేదీలోగా ఫైళ్ల డిజిటలైజేషన్, 9 వ తేదీలోగా ఉద్యోగులకు శిక్షణ పూర్తిచేసి, జూలై రెండోవారం నుంచే ఈ ఆఫీస్ ద్వారా ఆన్ లైన్ పరిపాలన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ ను డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ రూపొందించింది. ఉద్యోగి తన యూజర్ నేమ్, పాస్ వర్డ్ తో ఈ ఆఫీస్ లోకి ప్రవేశించి డిజిటల్ ఫైళ్ల సృష్టి, నిర్వహణలతో పాటు అధికారిక కార్యకలాపాలు నిర్వర్తించవచ్చు. ప్రతీ అధికారికి ప్రత్యేకంగా ఓ ఎన్క్రిప్టెడ్ డిజిటల్ కీ అందుబాటులో ఉంటుంది. తద్వారా దాంట్లోని డేటా, సమాచారం, ఇతర ఫైళ్లు టాంపర్ కు గురికాకుండా భద్రంగా ఉండే విధంగా సాఫ్ట్ వేర్ రూపొందించారు.