రిపబ్లిక్ డే విషెస్ చెప్పిన సీఎం కేసీఆర్ 

రిపబ్లిక్ డే విషెస్ చెప్పిన సీఎం కేసీఆర్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సమానత్వంతో కూడిన సమర్థవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26 ను (74వ గణతంత్ర దినోత్సవాన్ని) పురస్కరించుకొని సీఎం కేసీఆర్ రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక దేశంగా భారతదేశంలో రాజ్యాంగబద్ధ పాలనకు అంకురార్పణ జరిగిన జనవరి 26న భారత పౌరులందరికీ పండుగ రోజని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన మహోన్నత రాజ్యాంగాన్ని రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాతల కృషిని ఈ దేశ ప్రజలు సదా స్మరించుకుంటారని సీఎం తెలిపారు.

గుల్ దస్తా మాదిరి విభిన్న సామాజిక సంస్కృతులు, సాంప్రదాయాలు, భాషలు, ఆచారాలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని పొదిగివుండటడమే భారత దేశ ప్రధాన లక్షణమన్నారు. రాష్ట్రాల సమాఖ్యగా వర్థిల్లుతున్న భారత దేశంలో ఫెడరల్ స్ఫూర్తి పరిఢవిల్లుతూ, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మూలస్తంభాలుగా పాలన సాగినప్పుడు మాత్రమే దేశంలో సంక్షేమం పరిఢవిల్లి, దేశం మరింతగా ప్రగతి పథంలో పయనిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంటూ మనకు మనం సగర్వంగా సమర్పించుకున్న పవిత్ర రాజ్యాంగాన్ని ప్రతీ పౌరుడు క్షుణ్ణంగా అవగాహన చేసుకొని, ఆశయాలను సాధించేందుకు మరింతగా కృషి చేయాలని సీఎం కేసీఆర్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.