భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి 

భారీ అగ్ని ప్రమాదం..11 మంది మృతి

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని బోయిగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో బోయిగూడలోని ఓ టింబర్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి డిపో మొత్తానికి వ్యాపించడంతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఆప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. మంటల ధాటికి గోడౌన్ పైకప్పు కూలిపోయింది. ఈప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతిచెందారని అధికారులు తెలిపారు. 8 మంది సజీవదహనమవగా, మరికొందరు ఊపిరాడక చనిపోయారని పేర్కొన్నారు. మరొకరు క్షేమంగా బయటపడ్డారని వెల్లడించారు.

ప్రమాద సమయంలో టింబర్ డిపోలో 12 మంది ఉన్నారని తెలిపారు. మృతులంతా బీహార్ కు చెందిన వలస కార్మికులని తెలిపారు. మృతులను సికిందర్ ( 40), బిట్టు (23), సత్యేందర్ (35), గోలు (28), దామోదర్ ( 27), దినేష్ ( 35), రాజేశ్ (25 ), దీపక్ (26), రాజేశ్ ( 25), పంకజ్ ( 36), చింటు ( 27) గా గుర్తించారు. అగ్నిప్రమాదం జరిగిన భవనంలో టింబర్ డిపో, స్క్రాప్ గోదాం ఉన్నాయని పోలీసులు చెప్పారు. టింబర్ డిపో నుంచి స్క్రాప్ గోదాముకు మంటలు వ్యాపించాయన్నారు. పొగ దట్టంగా కమ్ముకోవడంతో మృతదేహాలను వెలికితీయడానికి ఇబ్బందైందని తెలిపారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.