ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ

ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ బహిరంగ లేఖహైదరాబాద్ : దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచే దిశగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపు నిర్ణయం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎరువుల ధరల పెంపుపై తాను నిరసన వ్యక్తం చేస్తూ నేడు ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని , కోట్ల మంది రైతుల తరపున విజ్ఞప్తి చేస్తున్నానని కేసీఆర్ తన లేఖలో వెల్లడించారు. 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2016లో ప్రకటించారు. ఇంత వరకు అతీగతీ లేదు.

రైతాంగం ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉందన్నారు సీఎం కేసీఆర్. ఎరువుల ధరలు 50 నుంచి 100 శాతం పెరిగాయి. గత 90 రోజులుగా ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే అనేక రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. గత 5 యేండ్లలో ఇన్ పుట్ కాస్ట్ రెట్టింపు అయిందన్నారు.

గుడ్డిగా కేంద్రప్రభుత్వం ఎరువుల ధరలను పెంచుతోందని కేసీఆర్ మండిపడ్డారు. యూరియా , డీఏపీ వినియోగం తగ్గించాలని రాష్ట్రాలకు చెబుతున్నారు. ఎరువుల ధరలు తగ్గించకపోగా, ఆ భారాన్ని రైతులపై నెడుతున్నారు. దేశంలోని కోట్లాది రైతుల పక్షాన చెబుతున్నా, ఎరువులు సబ్సిడీపై ఇవ్వాలి. రైతుల పెట్టుబడి మొత్తాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్రం చర్యలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎరువుల సబ్సిడీ విధానాన్ని రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా మార్చారు. 70 యేండ్లుగా ఎరువులపై సబ్సిడీ కొనసాగుతోంది. నరేగాతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని తెలంగాణ తీర్మానం చేసి పంపింది. ఐనా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు అని కేసీఆర్ వెల్లడించారు.