మూడు రిజర్వాయర్లకు శంకుస్థాపన సీఎం జ‌గ‌న్‌

హంద్రినీవా ద్వారా సాగునీరందించ‌డ‌మే ల‌క్ష్యం..
మూడు రిజర్వాయర్లకు శంకుస్థాపనలో సీఎం జ‌గ‌న్‌
ప్రతి గ్రామంలో జనతా బజార్లు తెస్తాం
రానున్న రోజుల్లో గ్రామాల రూపురేఖలు మార్చబోతున్నాం

మూడు రిజర్వాయర్లకు శంకుస్థాపన సీఎం జ‌గ‌న్‌అమ‌రావ‌తి: రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధ‌వారం ఉద‌యం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు వైఎస్సార్‌ అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి గ్రామంవద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌, మూడు రిజర్వాయర్ల భూమి పూజ పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్, సీఎస్ నీలం సాహానీ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో కొత్తగా 3 రిజర్వాయర్లను నిర్మిస్తున్నామని అదనంగా 3.3 టీఎంసీల కెపాసిటీ పెంచామని హంద్రినీవా ద్వారా సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం జగన్​ తెలిపారు. గత ప్రభుత్వాలు కేవలం ఎన్నికల ముందు వాగ్ధానాలు ఇచ్చాయని హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాముకు నీరు తరలించేందుకు రూ.803 కోట్లతో టీడీపీ అంచనాలు వేసిందని అదే డబ్బుతో తాము నాలుగు రిజర్వాయర్లు అదనంగా నిర్మించి పేరూరు డ్యాంకు నీరందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. 75,000 ఎకరాలకు సాగునీరు, చాలా గ్రామాలకు తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టు కాస్ట్ పెంచకుండా ఎక్కువ లబ్ది చేకూరుస్తున్నామని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల్లో టీడీపీ దోపిడీ చేసిందని టీడీపీ పాలనలో లంచాలు ఏ స్థాయిలో ఉన్నాయో దీన్ని బట్టి తెలుస్తోందని ఎద్ధేవా చేశారు. పేరూరు డ్యాం, ఇతర నాలుగు రిజర్వాయర్ల పరిధిలోని 75,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో జనతా బజార్లు తెస్తామని రానున్న రోజుల్లో గ్రామాల రూపురేఖలు మార్చబోతున్నామని అని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.