ఘనంగా పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలు : డీజీపీ

ఘనంగా పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలు : డీజీపీహైదరాబాద్ : అక్టోబర్ 21న నిర్వహించే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు సెప్టెంబర్ 21నుండి అక్టోబర్ 31 వరకు పోలీస్ ఫ్లాగ్ డే పేరుతో సంస్మరణ దినోత్సవాలను నిర్వహిస్తున్నట్టు డీ.జీ.పీ. ఎం.మహేందర్ రెడ్డి తెలియచేశారు. నేడు డీజీపీ కార్యాలయంలో పోలీసు అమరవీరుల దినోత్సవాల ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి అదనపు డీ.జీ.పీ లు గోవింద్ సింగ్, రాజీవ్ రతన్, జితేందర్, శివధర్ రెడ్డి, అనిల్ కుమార్, స్వాతి లక్రా, ఐజీలు ప్రభాకర్ రావు, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తదితరులు హాజరయ్యారు.

పూర్తిగా కోవిద్ నిబంధనలను పాటిస్తూ నిర్వహించే ఈ పోలీసు అమరవీరుల దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలలో పౌరులు పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా చర్యలు చేపడుతున్నట్టు డీ.జీ.పీ మహేందర్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 21 వ తేదీ నుండి అక్టోబర్ 31 వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాలను పోలీస్ ఫ్లాగ్- డే గా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని వెల్లడించారు.

అక్టోబర్ 21నుండి 31 వరకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రతీ జోన్ లో ఒక పోలీస్ స్టేషన్ లో ప్రత్యేకంగా ఓపెన్ హౌస్ నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆన్లైన్ పద్దతిలో వ్యాసరచన పోటీలు నిర్వహణ, భారత స్వతంత్ర పోరాట స్ఫూర్తిని కలుగ చేసే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పోలీసింగ్ అంశంపై ఫోటోగ్రఫీ కాంపిటీషన్, స్వల్ప నిడివి గల వీడియో కాంపిటీషన్ లను నిర్వహిస్తామని తెలిపారు.