తెలంగాణలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు

హైదరాబాద్ : ఆగ్నేయ అరేబియా సముద్రం మరియు దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం, లక్షదీవులు ప్రాంతాలలో ఈరోజు ( మే 31 వ తేదీన) ఉదయం అల్పపీడనంగా ఏర్పడింది. ఇది రాగల 24 గంటలలో తూర్పు మధ్య అరేబియా సముద్రం మరియు దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో వాయుగుండముగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రము తెలిపింది. తదుపరి 24 గంటలలో తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.

తెలంగాణలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు

తరువాత ఇది ఉత్తర దిశగా ప్రయాణించి జూన్ 3 వ తేదీకల్లా ఉత్తర మహారాష్ట్ర మరియు గుజరాత్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. రాగల 24 గంటలలో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైఋతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జూన్ 1 వ తేదీన కేరళ రాష్ట్రంలోనికి నైఋతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందన్నారు. ఇక చత్తీస్ గఢ్ నుంచి లక్షదీవులు వరకు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మరియు కేరళ మీదుగా 0.9 కీ.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుంచి 40 కీ.మీ పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు, ఎల్లుండి కొన్నిచోట్ల, రేపు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందిని, రాగల మూడురోజులు ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రము తెలిపింది.