ఉగాది నాటికే కొత్త జిల్లాలు: ఏపీ సీఎం

కొత్త జిల్లాల ఏర్పాటుపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష
ఉగాది నాటికే కొత్త జిల్లాలు
ఆరోజు నుంచే కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలు
ఆ మేరకు సన్నాహకాలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు
ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలని సీఎం ఆదేశం
వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందన్న సీఎం
పరిపాలన సాఫీగా సాగడానికి వీరి అనుభవం ఉపయోగపడుతుందన్న సీఎంఉగాది నాటికే కొత్త జిల్లాలు: ఏపీ సీఎంవరంగల్ టైమ్స్, అమరావతి: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలు, ప్రాతిపదికలను సీఎంకు అధికారులు వివరించారు. కొత్తజిల్లాల మ్యాపులు, జిల్లా కేంద్రాల నిర్ణయం వెనుక తీసుకున్న ప్రాధాన్యతలను అధికారులు సీఎంకే వివరించారు. అలాగే ప్రతిపాదనలపై వస్తున్న అభ్యంతరాలు, సలహాలు, సూచనలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నామని ఈ సమీక్షలో అధికారులు వైఎస్ జగన్ కు వెల్లడించారు. దీనిపై స్పందించిన సీఎం జగన్ కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత యంత్రాంగం అంతా సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. కొత్త జిల్లాలో పని ప్రారంభమైన తర్వాత ఎలాంటి అయోమయం ఉండకూడదు, పాలన సాఫీగా ముందుకు సాగాలని ఉపదేశించారు. దీనికోసం సన్నాహకాలను చురుగ్గా, వేగంగా, సమర్థవంతంగా మొదలు పెట్టాలని సీఎం అధికారులను కోరారు.

ఇక వచ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు కావాలని సీఎం జగన్ అధికారులను సూచించారు. ఉగాది నాటికి కొత్త జిల్లాల కలెక్టర్లు ,ఎస్పీలు ఆయా జిల్లాకేంద్రాల నుంచి పనిచేయాలని కోరారు. ఉద్యోగుల విభజన, మౌలిక సదుపాయాల ఏర్పాటు, కొత్త భవనాలు వచ్చేలోగా యంత్రాంగం పనిచేయడానికి అవసరమైన భవనాల గుర్తింపు, అన్నిరకాలుగా కూడా సిద్ధం కావాలని పేర్కొన్నారు. కొత్తగా మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యేలోగా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కావాల్సిన భవనాలు తదితర వాటిని గుర్తించాలన్నారు. అలాగే కొత్త భవనాల నిర్మాణంపైన ప్రణాళికలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటి కోసం స్థలాల గుర్తింపుపై దృష్టిపెట్టాలని సూచించారు. అభ్యంతరాల విషయంలో హేతుబద్ధత ఉన్నప్పుడు దానిపై నిశిత పరిశీలన చేయాలని చెప్పారు. నిర్ణయం తీసుకునేముందు తన దృష్టికి తీసుకురావాలన్నది చాలా ముఖ్యమైన విషయమని సీఎం చెప్పారు.

ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలని సీఎం ఆదేశించారు. పరిపాలన సాఫీగా సాగడానికి వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందన్నారు. స్థానిక సంస్థల (జిల్లాపరిషత్‌ల విభజన) విషయంలో కూడా అనుసరించాల్సిన విధానాన్ని న్యాయపరంగా, చట్టపరంగా పరిశీలించి తగిన ప్రతిపాదనలు తయారుచేస్తామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి(రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.