కొవిడ్ మరణాల ఎక్స్ గ్రేషియాకై దరఖాస్తుకు ఆహ్వానం

కొవిడ్ మరణాల ఎక్స్ గ్రేషియాకై దరఖాస్తుకు ఆహ్వానంహైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ -19 తో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రూ. 50 వేల ఎక్స్-గ్రేషియా అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కొవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలను ఎక్స్ -గ్రేషియా గా అందచేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఈ ఎక్స్ -గ్రేషియా పొందేందుకు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ విపత్తుల నివారణా శాఖ తెలియచేసింది. కొవిడ్-19 తో మృతి చెందినట్టు అఫీషియల్ డాక్యుమెంట్, ఇతర డాక్యుమెంట్లతో బాధిత కుటుంబసభ్యులు రాష్ట్రంలోని 4500 మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

ఈ దరఖాస్తులో బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇతర అవసరమయ్యే డాక్యుమెంట్లను జత పరచి మీ సేవా కేంద్రాల ద్వారా పంపాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రి సూపరింటెండెంట్ లు సభ్యులుగా ఉండే కొవిడ్ డెత్ నిర్దారణ కమిటీ కొవిడ్-19 మరణానికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుందని పేర్కొన్నారు. దీని అనంతరం ఎక్స్-గ్రేషియా మరణించిన వారి సమీప బంధువుల అకౌంట్లలో జమ చేయడం జరుగుతుందని పేర్కొంది.

ఇతర వివరాలకు మీసేవా ఫోన్ నెంబర్ 040 -48560012 అనే నెంబర్ కు గానీ, [email protected] అనే మెయిల్ కు సంప్రదించాలని డిజాస్టర్ మేనేజ్ మెంట్ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.