ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు ఐఎస్​వో గుర్తింపు

సమ‌ష్టి కృషితోనే సాధ్యమైందన్న చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు ఐఎస్​వో గుర్తింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) 9001-2015 సర్టిఫికెట్ దక్కించుకోవడం ఆనందంగా ఉందని ఆ సంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి అన్నారు. గతేడాది నైపుణ్య శిక్షణలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఎపిఎస్‌ఎస్‌డిసి ఈసారి ఈఘనత సాధించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ కాలేజీల్లో భాగస్వామ్యం కోసం అనేక సంస్థలు, పరిశ్రమలతో సంప్రదింపులు జరుపుతున్నామని. తెలిపారు. ఇప్పుడు ఐఎస్ఓ సర్టిఫికేషన్ రావడం సంస్థకు మరింత కలిసివస్తుందన్నారు.. ఈ ఘనత సాధించేందుకు కారణమైన సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు తాడేపల్లిలోని ఎపీఎస్‌ఎస్‌డీసీ ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము, ఎండి సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికెట్ అందుకున్నారు. అనంతరం నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీ అనంతరాము మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు ఐఎస్ఓ గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. సంస్థలో సిబ్బంది బాగా పనిచేస్తున్నప్పటికీ ఇతరులు గుర్తించినపుడే మన ప్రతిభ అందరికీ తెలుస్తుందన్నారు.ఈ సర్టిఫికేషన్ ను యుకెకి చెందిన అక్రిడేషన్ సర్వీసెస్ ఫర్ సర్టిఫైయింగ్ బాడీస్ సంస్థ అందించింది. కార్యక్రమంలో ఎపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీ హనుమనాయక్, ఐఎస్ఓ సంస్థ ప్రతినిధి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.