రూ.297.32 కోట్ల పనులు ప్రారంభించిన కేటీఆర్

రూ.297.32 కోట్ల పనులు ప్రారంభించిన కేటీఆర్

రూ.297.32 కోట్ల పనులు ప్రారంభించిన కేటీఆర్వరంగల్ టైమ్స్, భూపాలపల్లి జిల్లా : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భూపాలపల్లి నియోజకవర్గంలో రూ. 297.32 కోట్ల విలువైన పలు పనులను నేడు ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి కేటీఆర్ గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. భూపాపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి, శంకుస్థాపనలకు వచ్చిన కేటీఆర్ కు గణపురం మండలంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనా చారిలు పాల్గొన్నారు.

గణపురం చేరుకున్న కేటీఆర్ ముందుగా రూ.కోటి 20 లక్షల వ్యయంతో నిర్మించిన గణపురం తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గణపురం మండలం గాంధీ నగర్ లో రూ. 4 కోట్లతో నిర్మించిన నూతన మహాత్మా జ్యోతి బా పూలే బీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభించారు. ఇక జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ లో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కార్మికుల సౌకర్యార్థం రూ. 229 కోట్లతో నిర్మించిన 994 క్వార్టర్ల సముదాయానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కేటీఆర్ ప్రారంభించారు. సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని తిలకించి డబుల్ బెడ్ రూం సముదాయాన్ని ప్రారంభించారు.

తర్వాత భూపాలపల్లిలో రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్ అండ్ బీ అతిథి గెస్ట్ హౌస్ ని, సుభాష్ నగర్ కాలనీలో రూ. 14.59 లక్షల వ్యయంతో నిర్మించిన స్ట్రీట్ వెండర్ స్టాల్స్ ను, దివ్యాంగుల కోసం రూ. 23 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సెంటర్ ను కేటీఆర్ ప్రారంభించారు. భాస్కర్ గడ్డలో రూ. 33 కోట్ల వ్యయంతో నిర్మించిన 544 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం భూపాలపల్లి పట్టణంలో బృహత్వం మంచినీటి సరఫరా అభివృద్ధి పథకం కింద రూ. 6కోట్ల 80 లక్షల అంచనాతో చేపట్టే మిషన్ భగీరథ పనులకు, రూ. 4.5 కోట్లతో చేపట్టే మినీ స్టేడియం నిర్మాణ పనులకు, కోటి రూపాయలతో చేపట్టే జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి, భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కుల శ్రీ హర్షిని, వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ డీఎస్ దివాకర్ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.