ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పీఎం ఆఫీసు

ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పీఎం ఆఫీసుఢిల్లీ : ప్రధాని మోదీ ఆఫీసు కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టిన ఘటన వారణాసిలో వెలుగులోకి వచ్చింది. దీనిని ఏకంగా ఓఎల్ఎక్స్‌లోనే ఓ వ్యక్తి అమ్మకానికి పెట్టినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. పాత సామాన్లను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టే ఓఎల్ఎక్స్‌లో వచ్చిన ఓ ప్రకటన చూసి పోలీసులు షాక్‌కు గురయ్యారు. వారణాసిలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టినట్లు ఓఎల్ఎక్స్‌లో ప్రకటన ఇచ్చారని దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు విస్మయం చెందారు. ప్రస్తుతం ప్రధాని మోదీ వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారణాసిలోని గురుధామ్ కాలనీలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయాన్ని అమ్ముతున్నట్లు క్లాసిఫైడ్స్ వెబ్‌సైట్ ఓఎల్ఎక్స్‌లో ప్రచురితమైన ప్రకటనపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. మోదీ కార్యాలయం వివరాలు, ఫొటోలను ప్రచురిస్తూ, దీనిని రూ.7.5 కోట్లకు అమ్ముతామని ప్రకటనదారులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రకటనను వెంటనే తొలగించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారణాసిలోని మోదీ కార్యాలయం ఓ విల్లాలో ఉంది. ఓఎల్ఎక్స్‌లో ఇచ్చిన ప్రకటన ప్రకారం.. 6,500 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాగల ఈ విల్లాలో 4 గదులు, 4 బాత్రూములు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈశాన్య ముఖద్వారం ఉన్న ఈ ఇంట్లో రెండు అంతస్తులు ఉన్నాయని కార్ పార్కింగ్ కూడా ఉందని తెలిపారు. ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులు ఈ ప్రకటనను ఓఎల్ఎక్స్ నుంచి తొలగింపజేశారు. దీనికి బాధ్యులైన నలుగురిని గుర్తించి అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. లక్ష్మీకాంత్ ఓఝా అనే వ్యక్తి ఈ ప్రకటనను ఇచ్చినట్టు వారణాసి ఎస్పీ అమిత్ కుమార్ పాఠక్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఈ ప్రకటన కోసం విల్లా ఫొటో తీసిన వ్యక్తిని కూడా అరెస్టు చేశామన్నారు.