వరంగల్ టైమ్స్,రాయగిరి: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. నువ్వు ఏ అయ్యకు పుట్టినవో అడిగినమా మేము అని రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు సంస్కారం లేని మాటలని కేసీఆర్ మండిపడ్డారు. ఈ మాట అనొచ్చునా, ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ సంస్కారం ఇదేనా, మన హిందూ ధర్మం ఇదేనా, మన దేశం మర్యాద ఇదేనా, ఒక నేతను పట్టుకొని ఏం మాటలు మాట్లాడున్నారు, సీఎం స్థాయిలో ఉండి అలాంటివి అడుగుతారా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. జిల్లాలోని రాయగిరిలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి పార్లమెంట్లో జరిగిన అవమానం గురించి ప్రస్తావించారు. రాహుల్ గాంధీ అనే ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయనతో నాకు సంబంధం లేదు.
కానీ వాళ్ల నాయనమ్మ, నాన్న ఈ దేశం కోసం చనిపోయారు. వాళ్ల తాత స్వతంత్ర పోరాటం చేసి అనేక సంవత్సరాలు ప్రధాన మంత్రిగా పని చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నాడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడుతం. చర్చ జరుగుతది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు అడుగుతరు. ప్రజల తరుపున ప్రజాప్రతినిధులు కూడా అడుగుతరు. రాహుల్ గాంధీ ఏదో అడిగితే.. అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడారండి.. దయచేసి మీరు ఆలోచించాలి..నాకే కళ్లలో నీళ్లు తిరిగాయి. తల దించుకున్నంత పని అయింది. ఒక ఎంపీని పట్టుకొని మీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా. మహాభారతం, రామయణం, భగవద్గీత నుంచి మనం నేర్చుకున్నది ఇదేనా. హిందు ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఓట్లు రాల్చుకుంటున్నారు. బీజేపీ అధ్యక్షుడినే నేను అడుగుతున్నా. ఇదేనా మీ సంస్కారం. వెంటనే అస్సాం సీఎంను బర్తరఫ్ చేయండి..’’అని సీఎం కేసీఆర్ ప్రధాని మోడీని డిమాండ్ చేశారు.