వరంగల్ రూరల్ జిల్లా: ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతీ ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి లోని తమ నివాసంలో తమ సతీమణి ఉషా దయాకర్ రావు తో కలిసి పారిశుద్ధ్య పనులు చేశారు. ఇంట్లో మొక్కలకు నీళ్ళు పట్టారు. నీటి నిలువలు లేకుండా చేశారు. నీటి నిలువలున్నచోట్ల నీటిని తీసేసి, వాటిని పరిశుభ్ర పరచారు. మూతలు ఉండేలా చూశారు. చెత్తా చెదారం తీసేసి దోమలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శానిటేషన్ డ్రైవ్ అనంతరం ప్రతీ ఆదివారం పది గంటలకు, పది నిమిషాలు కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా నిర్వహించాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంటితోపాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రాష్ట్రాన్ని, దేశాన్ని రోగ రహితంగా ఉంచవచ్చని, ఇలాంటి కార్యక్రమాల అమలు వల్లనే రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పచ్చదనం-పరిశుభ్రత, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, స్వచ్ఛ హైదరాబాద్ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. ఇక తాజాగా ప్రభుత్వం ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించే హరిత హారం కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని ఆయన కోరారు.