స్కూళ్ల ప్రారంభానికే సర్కారు మొగ్గు!

30తో ముగియనున్న సెలవులు
ఇప్పటికే వివిధ వర్గాల నుంచి ఒత్తిడి
ప్రభుత్వ నిర్ణయంపైనే అందరి చూపు
విడతల వారీగా తెరవాలని యోచనస్కూళ్ల ప్రారంభానికే సర్కారు మొగ్గు!

హైదరాబాద్ : విద్యా సంస్థలను ప్రారంభించాలా? లేక ప్రస్తుతం కొనసాగుతున్న సెలవులను మరిన్ని రోజుల పాటు పొడిగించాలా? అనే అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలిసింది. రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు నిలకడగా ఉండడం, విద్యా సంస్థల ప్రారంభంపై వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని త్వరలోనే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీ నుంచి విద్యా సంస్థలను మూసివేసిన విషయం తెలిసిందే.

తొలుత 16వ తేదీ వరకు సంక్రాంతి పండుగ సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని 30వ తేదీ వరకు సెలవులను పొడిగించారు. ప్రస్తుతం 8,9,10వ తరగతుల విద్యార్థులతో పాటు, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 30తో ముగియనున్న సెలవులను పొడిగిస్తారా? లేక విద్యా సంస్థలను ప్రారంభిస్తారా? అన్న అంశంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు పాఠశాలలను తెరవాలని ప్రైవేట్‌ యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి.

రెండేళ్ల నుంచి స్కూళ్లు సరిగ్గా నడవకపోవడంతో విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడిందని వాదిస్తున్నాయి. వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా జరుగుతుండడం, ప్రస్తుత కరోనా వేరియంట్‌ అంత ప్రమాద కారి కాకపోవడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని విద్యా సంస్థలను తెరవాలని కోరుతున్నాయి. కాగా, ఈ ఏడాది వార్షిక పరీక్షలను ఏప్రిల్‌, మే నెలల్లో నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

ఈ మేరకు ఇంటర్‌, పదో తరగతి పరీక్షల ఫీజుల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయా కోర్సుల్లో ప్రవేశాల కోసం వివిధ సెట్లను నిర్వహించాల్సి ఉంది. అయితే, ఇవన్నీ సవ్యంగా జరగాలంటే… ముందు ఈ ఏడాదికి సంబంధించిన విద్యా బోధన పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యక్ష తరగతులను తప్పనిసరిగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని 31వ తేదీ నుంచి రాష్ట్రంలో విద్యా సంస్థలను తిరిగి తెరవడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అవసరమైతే దశల వారీగా విద్యా సంస్థలను తెరిచే అవకాశం ఉందని చెబుతున్నారు.