సీఎం ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం
సురక్షితంగా గన్నవరం ఎయిర్పోర్టులో తిరిగి ల్యాండింగ్
ఢిల్లీ వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
రేపు ఉదయం ఢిల్లీ వెళ్లనున్న సీఎం
వరంగల్ టైమ్స్ , అమరావతి:ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహక సమావేశం కోసం ఢిల్లీ వెళ్తున్న ఏపీ సీఎం వైయస్ జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఏసీ వాల్వ్లో లీకేజి కారణంగా ప్రైజరైజేషన్ సమస్య తలెత్తిందని పైలట్ గుర్తించినట్టుగా ప్రాథమికంగా తెలిసిందని అధికారులు తెలిపారు. సమస్యను గుర్తించిన పైలట్ తిరిగి గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు. ఢిల్లీ పర్యటన కోసం సీఎం, అధికారుల బృందం సాయంత్రం 5:03 గంటలకు టేకాఫ్ అయ్యింది.
కాసేపటికే పైలట్ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు.దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. తిరిగి సాయంత్రం 5:27 గంటలకు గన్నవరంలో ల్యాండ్ అయ్యారు. సీఎం తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. సీఎం ఢిల్లీ వెళ్లేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం తిరిగి సీఎం ఢిల్లీకి వెళ్లనున్నట్టు సీఎంఓ అధికారులు వెల్లడించారు.